డిచ్పల్లి/నందిపేట్/మాచారెడ్డి/ మాక్లూర్, ఏప్రిల్ 19: ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయం త్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడి న భారీ వడగండ్ల వాన కురిసిం ది. ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో పంటనష్టం వాటిళ్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. దీంతో ఎండబెట్టిన వడ్ల కుప్పలు తడిసిపోయాయి. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఎన్హెచ్-44 వద్ద ఓ ట్రాన్స్ఫార్మర్పై చెట్టు విరిగిపడడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇందల్వాయిలో చిన్నవాగు నుంచి తండా వరకు 50 కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. మామిడి కాయలు రాలిపోయాయి.
కల్లాల్లో ఎండబెట్టిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. నందిపేట్ మండలంలోనూ రాళ్లవాన కురిసింది. ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఖుద్వాన్పూర్ శివారులో మాదిగకుంట వద్ద మేస్తున్న పశువులపై పిడుగు పడడంతో మూడు జీవాలు మృత్యువాత పడ్డాయి. మాచారెడ్డి మండలంలో పలు గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పం టలు నేలకొరిగాయి. ఈదురు గాలులకు సోమార్పేట గ్రామంలో ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఓ మామిడి చెట్టు విరిగి ట్రాక్టర్పై పడడంతో వాహనం ధ్వంసమైంది. మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామంలో పిడుగు పాటుకు నలుగురికి గాయాల య్యాయి. గ్రామానికి చెందిన సుంకరి నారాయణ, సుంకరి శివ, సుంకరి బన్నీ, చాకలి శంకర్ వడ్లను కుప్పలుగా చేస్తుండగా పిడుగుపాటుకు గాయాలయ్యాయని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించారు.