పల్లె ప్రజలకు పట్టణ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానలకు విశేషమైన స్పందన లభిస్తున్నది. దీంతో ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి నిర్ధారణ చేసి, చికిత్స అందించేందుకు గ్రామ స్థాయిలో పల్లె దవాఖానల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది. దీంతో ప్రైవేటు దవాఖానల్లో ఓపీ సేవలకు వందలాది రూపాయలు ఖర్చు చేసే దుస్థితికి చెక్ పడనున్నది. నాణ్యమైన వైద్యం అందించేందుకు నిష్ణాతులైన వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం చేపడుతున్నది. తొలి విడుతలో ఉమ్మడి జిల్లాకు దాదాపు 100 పోస్టులు మంజూరు కాగా తాజాగా రెండో విడుత మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సర్వీసెస్ కింద కాంట్రాక్టు పద్ధతిలో మరో 89 పోస్టులు మంజూరు అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 507 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా.. ప్రభుత్వం వీటిని దశల వారీగా పల్లె దవాఖానలుగా తీర్చిదిద్దనున్నది.
నిజామాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్ మహానగరంలో ప్రారంభించిన బస్తీ దవాఖానల ద్వారా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రాథమిక స్థాయిలోనే ప్రజల ఆరోగ్య సమస్యలకు చెక్ పడుతుండడంతో పాటు పేద, మధ్య తరగతి వర్గాలకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు దక్కింది. దీంతో ప్రజలకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి బస్తీ దవాఖానలతో పాటు గ్రామ స్థాయిలో పల్లె దవాఖానల ఏర్పాటుకు నిర్ణయించింది. ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వైద్యారోగ్య శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ అనేక చోట్ల పల్లె దవాఖానలు అద్భుతంగా రూపుదిద్దుకొని ప్రజలకు సేవ చేయడానికి ముస్తాబవుతున్నాయి. ప్రైవేటు దవాఖానల్లో ఓపీ సేవలకు వెళ్లి నిమిషాల వ్యవధికి రూ.వందల్లో చెల్లింపులు జరపాల్సిన దుస్థితికి పల్లె దవాఖానలతో అడ్డుకట్ట పడనున్నది. ఇందుకోసం నాణ్యమైన వైద్యం అందించేందుకు నిష్ణాతులైన వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం చేపడుతున్నది. తొలి విడుతలోనే ఉమ్మడి జిల్లాకు దాదాపు 100 పోస్టులు మంజూరు కాగా తాజాగా రెండో విడుత మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సర్వీసెస్ కింద కాంట్రాక్టు పద్ధతిలో మరో 89 పోస్టులు మంజూరు కావడం విశేషం.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 507 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా ప్రభుత్వం వీటిని దశల వారీగా పల్లె దవాఖానలుగా తీర్చిదిద్దనున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా గ్రామాగ్రామాన ఓ వైద్యశాల ఏర్పాటు చేసి వైద్య సేవలు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణ, నిర్వహణ నిధులకు సంబంధించి ఎలాంటి కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 25.51 లక్షల జనాభా ఉంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 47 వరకు ఉన్నాయి. నిత్యం దవాఖానల్లో 10వేల మందికి ఓపీ సేవలు అందుతున్నాయి. పల్లె దవాఖానలు మనుగడలోకి వస్తే పేదలపై వైద్య భారం తగ్గనున్నది. ప్రస్తుతం గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు ఇష్టానుసారంగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటూ అమాయకులను నట్టేట ముంచుతున్నారు. కార్పొరేట్ దవాఖానలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలను అనవసరపు భయాలతో ప్రైవేటు వైద్యశాలలో అడ్మిట్ చేయించి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. పల్లె దవాఖానాలు వస్తే ఇలాంటి దోపిడీకి అడ్డుకట్ట పడనున్నది.
వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో రోగులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలోనూ సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వస్తున్నది. మారుమూల ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ప్రస్తుతం మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే వైద్యులు అరకొరగా అందుబాటులో ఉంటున్నారు. గ్రామీణులకు వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్ఎంలే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పల్లె దవాఖానల్లో ఎంబీబీఎస్ వైద్యులను నియమించబోతున్నది.
తద్వారా మేలైన వైద్య సేవలు స్థానికంగా ఆరోగ్య ఉప కేంద్రాల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందిస్తారు. ప్రాథమిక చికిత్స, మాతా శిశు సంరక్షణ సేవలు, టీకాల పంపిణీతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులకు వైద్య సేవలు అందనున్నాయి. 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. రోజూ అక్కడే నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు పంపుతారు. మరుసటి రోజు ఆ నమూనాల ఫలితాలు తిరిగి పల్లె దవాఖానలకు వస్తాయి.
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల రాక్షస పరిపాలన నుంచి విముక్తి పొందిన అనంతరం తెలంగాణలో ప్రజలకు జరుగుతున్న మేలు అంతా ఇంతా కాదు. అన్ని రంగాలతో పాటు ప్రభుత్వ వైద్య వ్యవస్థలో గణనీయమైన మార్పులు సంభవించాయి. దవాఖానల్లో రూ.వేల కోట్లతో మౌలిక వసతుల కల్పన జరిగింది. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. దవాఖానల్లో పడకల సంఖ్యను గణనీయంగా పెంచింది. పీహెచ్సీ, సీహెచ్సీలతో పాటు ఏరియా, జనరల్ దవాఖానల్లో సౌకర్యాలను మెరుగుపరిచింది.
అధునాతన సాంకేతిక పరికరాలను తీసుకు వచ్చి నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందిస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో సర్కారు దవాఖానలు ఇప్పుడు ప్రైవేటు కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా మారాయి. అసౌకర్యాలను, ఇబ్బందులను దూరం చేయడం ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు విస్తృతం అయ్యాయి. ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా రూపాంతరం చేస్తూ ప్రజలకు ధైర్యాన్ని, ైస్థెర్యాన్ని అందించే కార్యక్రమం ద్వారా మరింత భరోసా కలుగుతున్నది.