నిజామాబాద్ రూరల్/ఖలీల్వాడీ(మోపాల్), సెప్టెంబర్ 12 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆశించిన మేర అభివృద్ధి చేశానని, ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తనను ఆశీర్వదించాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం నిజామాబాద్లోని ఆయన నివాస ప్రాంగణంలో వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు, అభివృద్ధి పనులు చూసి మళ్లీ బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు పలుకాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని బాజిరెడ్డి ప్రజలకు సూచించారు.
ఆసరా పింఛన్లతో ఓ తండ్రిగా.. సోదరుడిగా.. పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ అందరికి అండగా నిలుస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే 4 వేల పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు చెబుతున్నదని, ఇప్పటివరకు పింఛన్లు పెంచి ఇచ్చింది కేసీఆరేనని, ఇంకా పెంచి ఇచ్చేది కేసీఆరేనని ఎవరి వల్ల అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను నమ్మొద్దన్నారు. మోపాల్ మండల కేంద్రంలోని రైతువేదికలో కంజర, సింగంపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
డిచ్పల్లి, సెప్టెంబర్ 12 : మండలంలోని నక్కలగుట్ట తండా గ్రామానికి చెందిన బీజేపీ ఉపసర్పంచ్ ఎల్.మోబీసింగ్ నాయక్ మంగళవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో సొంతగూటికి చేరారు. బాజిరెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య, రామరాజు పాల్గొన్నారు.