కంఠేశ్వర్, ఫిబ్రవరి 19: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల తీరుతో అభాసుపాలవుతున్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వినతులు అందించినా పరిష్కారానికి నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి భద్రతా వైఫ ల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కలెక్టరేట్ ప్రాంగణంలోని దరఖాస్తులు స్వీకరించే హాలులోకి సోమవారం వేల్పూర్ మండలం జాన్కంపేట గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడమే ఇందుకు నిదర్శనం. గత ప్రజావాణిలో ధర్నా నిర్వహించిన గ్రామస్తులు మరోసారి నిరసన తెలపడం గమనార్హం. వీరి ధర్నాతో దాదాపు 20 నిమిషాల పాటు ప్రజావాణి స్తంభించింది. దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయింది. అధికారులు స్పందించి ఇకనైనా ప్రజావాణి కార్యక్రమం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 88 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో డీపీవో చక్రవర్తి తరుణ్కుమార్, ఆర్డీవో రాజేంద్రప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.