చందూర్, డిసెంబర్ 29 : రైతన్నను ఇబ్బందులు పెట్టే నాయకులకు పుట్టగతులుండవని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆలోచించే నాయకులే ప్రజలను పాలిస్తారని, ఆరోపణలు చేసే నాయకులు మధ్యలోనే అంతమైపోతారని అన్నా రు. గురువారం ఆయన చందూర్ మండల కేంద్రంలో నిర్మించిన సహకార సంఘ భవనాన్ని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడారు. రైతులతో కూడుకున్న గ్రామం చందూర్ అని పేర్కొన్నారు. రాష్టంలో వరి అత్యధికంగా పండించే ఏకైక నియోజకవర్గం బాన్సువాడ అని చెప్పారు. 2014లో 54 లక్షల మంది రైతులు ఉండగా, కోటీ 8 లక్షల ఎకరాల్లో సాగు చేసేవారని తెలిపారు.
ఎనిమిదేండ్ల తర్వాత కోటీ 53 లక్షల ఎకరాల్లో 70 లక్షల 40 వేల మంది రైతులు సాగుచేస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నీటి సమస్య పరిష్కారమైందన్నారు. నిజాంసాగర్ 41 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా చింతకుంట వరకు పొలాలకు సాగునీరు అందుతున్నదన్నారు. రూ. 106 కోట్లతో ఏర్పాటు చేస్తున్న చందూర్, జాకోరా లిప్ట్ ద్వారా జూన్ నాటికి రూ. 12 వేల ఎకరాలకు నీరందిస్తామన్నారు.
రైతన్నను కాపాడుకుంటేనే దేశం బాగుపడుతుందన్నారు. రైతులు లేకపోతే అందరికీ ఉపవాసమే అని, డబ్బులు ప్రింట్ చేసి వాటిని వండుకొని తినలేం కదా అని పేర్కొన్నారు. చందూ ర్ ప్రాం తంలో రైతులు అప్పు ల్లో లేరని, మూడువేల మందికి రైతుబంధు అందజేశామన్నారు. రైతు తల ఎత్తుకొని బతకాలన్నారు. చందూర్ నుంచి జలాల్పూర్ వరకు రూ. 11.20కోట్లతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిపారు. లక్ష్మాపూర్ నుంచి చింతకుంట వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 60 లక్షలు మంజూరైనట్లు స్పీకర్ చెప్పారు.
చందూర్కు కొత్తగా 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేశామన్నారు. గ్రామం లో రైతులు పంట పొలాలకు వెళ్లాడానికి మట్టి రోడ్డు నిర్మాణానికి రూ.రెండు లక్షలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీటీసీ అంబర్ సింగ్, ఏఎంసీ చైర్పర్సన్ కవితా అంబర్ సింగ్ , ఎంపీపీ లావణ్య, వైస్ ఎంపీపీ దశాగౌడ్ , ఎంపీటీసీ శ్యామ్రావు , సహకార సంఘం చైర్మన్లు మాధవరెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో నీలావతి, తహసీల్దార్ వసంత, సర్పంచులు కర్లం సాయారెడ్డి, బొడ్డోళ్ల సత్యనారాయణ, దేవీసింగ్, రవి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.