దశాబ్దాల కల.. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ తీరనున్నది. పోడు సమస్యకు కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనున్నది. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులకే ఆ భూములపై హక్కులు కల్పించనున్నది. జూన్ 24నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. అటవీ భూములపై ఆధారపడిన వారికి భూ యాజమాన్య హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. గతంలోనే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేసింది. నిజామాబాద్ జిల్లాలో 3,654, కామారెడ్డి జిల్లాలో 4,013 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి పట్టాలు ఇవ్వనుండడంతో రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించనున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పోడు రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. మరోవైపు, పోడు పట్టాల పంపిణీతో అటవీ భూముల అన్యాక్రాంతానికి చెక్ పెట్టాలని సర్కారు నిర్ణయించింది. తమ కమతాల చుట్టూ ఉన్న ఫారెస్టు భూముల రక్షణ సదరు పట్టాదారులకే అప్పగించనున్నది. తద్వారా ఆక్రమణలకు అవకాశం లేకుండా కట్టడి చేయనున్నది.
నిజామాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. సువిశాలమైన అడవి ఎక్కడ చూసినా ఆక్రమణలతో కకావికలమైంది. కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బడాబాబులు అనేక మంది పోడు పేరు తో సామాన్యులను ముందు పెట్టి విలువైన భూములను ఆక్రమించారు. దర్జాగా అటవీ భూమిని చేతుల్లోకి తీసుకుని జల్సా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అటవీ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. పోడు భూముల సమస్యను రూపుమాపేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసి, త్వరలోనే పట్టాల పంపిణీకి సిద్ధం అవుతున్నది. ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ ఆదేశాలతో జూన్ 24 నుంచి పట్టాలు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. పోడు భూముల్లో సాగు లెక్కలు ఇప్పటికే తేల్చారు. భవిష్యత్తులో అటవీ భూముల పరిరక్షణే ధ్యేయం గా అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పోడుకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఇకపై అంగుళం భూమి ఆక్రమణలకు గురి కాకుండా పక్కాగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకు న్నది. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా దశాబ్దాల పాటు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ పట్టాల కోసం ఎదురు చూస్తున్న వారి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తుండడంతో ఆ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఇదీ లెక్కా…
అటవీ భూములను ఆక్రమించిన వారిలో గిరిజనులు అయితే 2006కు ముందు నుంచి సాగులో ఉండాలి. అలాంటి వారి ఆర్థిక స్థితిగతులు వివరాలను ప్రభుత్వం పరిశీలించింది. పది ఎకరాలలోపు కబ్జాలో ఉండి… ఆ భూమే జీవనాధారంగా ఉంటే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పొందేందుకు అర్హులు. ఇందుకోసం గతేడాది అర్హులైన వారి క్లెయిమ్స్ స్వీకరించారు. సాగు చేసుకుంటున్న వారు ఆధారాలతో ఎఫ్డీవో స్థాయి అధికారులకు దరఖాస్తులు అందించారు. గ్రామ, డివిజినల్ కమిటీలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సిఫార్సు చేస్తే ఆఖరున జిల్లా కమిటీ అర్హులను ఎంపిక చేసింది. గిరిజనేతరులైతే ఆ కుటుంబం నుంచి మూడు తరాల వారు ఆ భూ మిలో సాగు చేసుకుంటున్నట్లు ఆధారాలు ఉండాలి. అటవీ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారు నిజామాబాద్ జిల్లాలో 19 మండలాల్లో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం అటవీ భూమి 2,14,700 ఎకరాలు ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఆక్రమణకు గురైంది 13,687 ఎకరాలు. సమస్యఉన్న గ్రామా లు 75 వరకు ఉన్నాయి. రెవెన్యూ, అటవీ శాఖల సరిహద్దు వివాదం 10,599 ఎకరాలుగా తేల్చారు. ఆక్రమణకు యత్నించిన వారిపై మూడేండ్లలో 287 కేసులు పెట్టారు. కామారెడ్డి జిల్లాలో అటవీ విస్తీర్ణం 2,04,727 ఎకరాలు ఉండగా పెద్ద ఎత్తున 27,554 ఎకరాలు అన్యాక్రాంతమైంది. సమస్యలున్న గ్రామాలు 241 గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 3వేల 654 మంది లబ్ధిదారులను అటవీ శాఖ గుర్తించింది. నిజా మాబాద్ డివిజన్లో 1138 మంది, ఆర్మూర్లో 1269 మంది, బోధన్లో 1247 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4,013 మందికి పోడు పట్టాలిచ్చేందుకు నిర్ణయించారు. కామారెడ్డి డివిజన్లో 1505, బాన్సువాడ 1006, ఎల్లారెడ్డి 1502మంది పోడు వ్యవసాయదారులు ఉన్నారు.
ఇక ఆక్రమణలకు చెల్లుచీటి…
మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక్క చె ట్టూ మిగలదు. అడవుల రక్షణ, పచ్చదనం పెంచ డం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు గొప్ప ఫలితాలు ఇస్తున్నాయి. బయో డైవర్సిటీ సైతం వెల్లివిరుస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అటవీ సంపద గతంతో పోలిస్తే పరిరక్షించబడుతున్నది. హరితహారం కార్యక్రమం ద్వారా సాధిస్తోన్న ఫలితాలతో దేశానికే రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శం గా నిలుస్తున్నది. సమస్య అంతా బయటి నుంచి వచ్చి అటవీ భూములను ఆక్రమించి, అడవిని నరికి, దుర్వినియోగం చేసే వారితోనే ఉంది. వారి స్వార్థానికి అడవులు బలి అవుతున్నాయి. పోడు భూముల సమస్య పరిష్కారమైన మరుక్షణం నుంచే అటవీ భూముల రక్షణ కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టేందుకు నడుం బిగించబోతున్నది. ఆతర్వాత అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకునే బాధ్యత అటవీ శాఖదేనని ఇప్పటికే సర్కారు స్పష్టం చేసింది. అటవీ భూములపై సర్వే సైతం చేపట్టి కచ్చితమైన సమాచారాన్ని సేకరించనున్నారు. అటవీ భూములకు స్పష్టమైన సరిహద్దులను నిర్ధేశించి ఈంచు భూమి కూడా భవిష్యత్తులో పోడుకు బలి కాకుండా చూసేందుకు సత్వర చర్యలకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
పట్టాలు వస్తే రైతుబంధు, రైతుబీమా
పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు అమలు కావడం లేదు. వీరంతా అటవీ భూములను చదును చేసుకొని అక్రమంగా సాగు చేసుకుంటున్నట్లే ప్రభుత్వ లెక్కల్లో నమోదై ఉంది. వీటికి రెవెన్యూ శాఖలో ఎక్కడా పట్టాలిచ్చిన దాఖలాలే లేవు. జీవనోపాధిలో భాగంగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న పోడు భూములను క్రమబద్ధీకరించేందుకు సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇందు లో భాగంగా పట్టాలు అందిస్తున్నారు. రాష్ర్టావిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా పట్టాల పంపిణీకి చర్య లు తీసుకుంటున్నారు. పట్టాలు పొందిన పోడు రైతులకు ఇకపై రైతుబంధు పథకం అమలు కాను న్నది. దీంతో పాటు పట్టాదారుడికి రైతుబీమా పథకం కూడా వర్తించనున్నది. విద్యుత్ సౌకర్యం కూడా అందుబాటులోకి రానున్నది. సాగు నీటి వసతి సౌకర్యం అందే అవకాశాలు ఏర్పడతాయి. ఇన్ని రోజులు ప్రభుత్వం ద్వారా చిల్లిగవ్వ సాయం పొందని వారంతా పట్టాలు అందుకున్న తర్వాత అధికారికంగా హక్కుదారులుగా మారుతారు.ఈ మేరకు రైతుబంధు, రైతుబీమా, విద్యుత్ సౌకర్యా న్ని పోడు భూములను క్రమబద్ధీకరించిన వాటికి అందివ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పోడు భూముల పట్టాలను రాష్ర్టావిర్భావ వేడుకల్లో భాగంగా జూన్ 24 నుంచి పంపిణీ చేసేందుకు ప్ర భుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సీఎం నిర్ణయంతో పోడు వ్యవసాయం చేసుకుంటు న్న లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న పట్టా హక్కులు దక్కించుకోబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 30 వరకు పట్టాల పంపిణీ చేపట్టనున్నారు. ఇప్పటికే సాగుదారులను యంత్రాంగం గుర్తించింది. వారందరికీ సమాచారం అందించి సరైన వేదికను ఏర్పాటు చేసి పట్టాలను పంపిణీ చేస్తారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వడం సంతోషకరం
చాలా ఏండ్లుగా పోడు భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న (గిరిజనులకు), మాలాంటి పోడు రైతులకు పట్టాలు ఇవ్వడం సంతోషకరమైన విషయం. పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ను జీవితాంతం గుర్తుంచుకుంటాం.
-బాదావత్ మహేందర్, సోమారం తండా, గాంధారి మండలం.
పోడు పట్టాలతో పాటు, రైతు బంధు వస్తుంది
పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పోడు పట్టాలతో పాటు పంటలు సాగు చేసుకోవడానికి రైతు బంధును వర్తింప చేయడం సంతోషకరమైన విషయం. పోడు భూములను నమ్ముకొని బతుకుతున్న రైతులు సీఎం కేసీఆర్కి రుణపడి ఉంటారు.
-నేనావత్ రమేశ్, కర్ణంగడ్డ తండా, గాంధారి