Hanmanth Shinde | బిచ్కుంద, మే 28: బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గురువారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరగబోయే పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ సన్నాహక సమావేశానికి జుక్కల్ నియోజకవర్గం లోని మహ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం, పెద్ద కొడప్గల్, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, డోంగ్లి మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, బిచ్కుంద మున్సిపాలిటీ యూత్ సమన్వయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఈ సన్నాహక సమావేశానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ఇన్చార్జులు పాల్గొంటారని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పార్టీ పూర్తిగా ఆన్లైన్ విధానంలో చేపడుతుందని తెలిపారు. నియోజకవర్గంలో నియమితులైన యూత్ సమన్వయ కమిటీ సభ్యులు నాయకులతో మమేకమై ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా తగు జాగ్రత్త చర్యలు తీసుకొని సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.