బాన్సువాడ టౌన్, మే 11 : ఇతర రాష్ట్రాల్లో రైతులు పండించిన ధాన్యం విక్రయించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని, కానీ మన రాష్ట్రంలో వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొనుగోలు చేసిన వారం రోజుల్లో రైతుఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నట్లు చెప్పారు. గురువారం ఆయన బాన్సువాడలోని తన నివాసంలో 46 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, 12 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,, ఒకరికి ప్రమాదబీమా చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఇండ్లను నిర్మించుకోవడానికి పేదలకు రూ.5 లక్షల సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారు అని తెలిపారు. రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గానికి 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు.
ఇందులో కాంట్రాక్టర్ల ద్వారా మూడు వేల ఇండ్లు కట్టించగా, మిగతా ఇండ్లను లబ్ధిదారులు సొంతంగా కట్టుకున్నారని వివరించారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే రూ.3 లక్షల పథకం కింద మంజూరుచేస్తానని అన్నారు. స్థానిక ఆర్డీవోకు వినతిపత్రం అందజేయాలని సూచించారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ రూ. 1,00,116 అందజేసి అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని పూర్తిగా ఉచితమని, ఈ పథకం పొందడానికి ఎవరికీ పైసా లంచం ఇవ్వరాదన్నారు.ఎవరైనా ప్రజాప్రతినిధులు, నాయకులకు లంచం ఇచ్చినట్లు తెలిస్తే ఇచ్చిన వారిని, తీసుకున్నవారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వారికి సంక్షేమ పథకాలను కూడా రద్దు చేయిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వర్ని జడ్పీటీసీ హరిదాస్, ఎంపీపీ వీర్రాజు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సింగంపల్లి గంగారాం, బీఆర్ఎస్ వర్ని మండల అధ్యక్షుడు గిరి, పీఆర్ డీఈ నాగేశ్వర్రావు, శ్రీనగర్ సర్పంచ్ రాజు, వర్ని మండలం పరిధిలోని సర్పంచులు, ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థికి స్పీకర్ అభినందన
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థా యి ర్యాంకు (బైపీసీలో 994/1000) సాధించిన బాన్సువాడ భారతరత్న కళాశాల విద్యార్థినిని ఉమ్ర మహవిన్ను స్పీకర్ అభినందించారు. కళాశాల చైర్మ న్ పి. నారాయణ రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అకడమిక్ అడ్వైజర్ ప్రతాప్ రెడ్డి, ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, అధ్యాపకులు శ్రీనివాస్, రాంనారాయణ, హన్మాండ్లు, బాబయ్య, సంజీవ్రెడ్డి, శిరీష, జైపాల్, సృజన ఉన్నారు.