కామారెడ్డి, జూన్ 22 (నమస్తే తెలంగాణ): జిల్లాలో 21 రోజులపాటు ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రారంభమైన వేడుకలను విజయవంతం చేయడానికి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తీవ్రంగా శ్రమించారు. ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయపరుస్తూ ఏ లోటూ లేకుండా సభలు, సమావేశాలు, ఉత్సవాలను నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మరుసటి రోజు చేపట్టే కార్యక్రమాలపై అధికారులతో నేరుగా, వీడియో, టెలీకాన్ఫరెన్సుల ద్వారా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే సమావేశాల్లో పాల్గొనే ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ, రోజుకు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సమావేశాల్లో పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాలకు జిల్లా ఇన్చార్జిగా వ్యవహరించిన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 20 రోజుల పాటు నిరంతరం ఉత్సవాల నిర్వహణపై దృష్టిసారించి విజయవంతం చేశారు.
ఊరూరా ఉత్సవాలు
ఈనెల 2న తెలంగాణ అవతరణ దినం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. 20 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. 3న తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహించగా..సదాశివనగర్ మండలం పద్మాజివాడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. 4న జరిగిన సురక్షా దినోత్సవంలో ఎస్పీ కార్యాలయం నుంచి కళాభారతి వరకు పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్పీకర్ పోచారం, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు సురేందర్, హన్మంత్ షిండే, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి ర్యాలీలో పాల్గొనగా, ప్రజలు వారిపై పూల వర్షం కురిపించారు. 5న విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ దినోత్సవంలో విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని వివరించారు. 6న జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సభలో స్పీకర్తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొని పారిశ్రామిక రంగంలో జరిగిన ప్రగతిని వివరించారు. 7న సాగునీటి దినోత్సవం జరుగగా, సాగునీటి రంగంలో జరిగిన ప్రగతిని వివరిస్తూ అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి, రైతులకు వివిధ ప్రాజెక్టుల గురించి తెలియజేశారు. స్పీకర్ పోచారం సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రసంగించారు. 8న ఊరూరా చెరువుల పండగ నిర్వహించగా, అన్ని గ్రామాల్లో ప్రజలు డప్పులు, బోనాలు, బతుకమ్మలతో చెరువులకు చేరుకొని ఉత్సవాలు జరుపుకొన్నారు. 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు, 10 తెలంగాణ సుపరిపాలన దినోత్సవం,11న తెలంగాణ సాహిత్య దినోత్సవం,12న తెలంగాణ రన్, 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం, 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం, 15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న తెలంగాణ గిరిజనోత్సవం, 18న తెలంగాణ మంచినీళ్ల పండుగ, 19న తెలంగాణ హరితోత్సవం, 20న తెలంగాణ విద్యాదినోత్సవం, 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం, 22న తెలంగాణ అమరవీరుల దినోత్సవంతో దశాబ్ది ఉత్సవాలు ముగిశాయి.
ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
దశాబ్ది ఉత్సవాలతో సుమారు 20 రోజుల పాటు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతిరోజూ కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు తీరిక లేకుండా పాల్గొన్నారు. 20 రోజుల పండుగ గురువారంతో ముగియడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.