కోటగిరి/రుద్రూర్, సెప్టెంబర్ 27: మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్ట్రంలోనూ లేవని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో బాన్సువాడ నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారినట్లు తెలిపారు. మంగళవారం ఆయన కోటగిరి మండల కేంద్రంలో బతుకమ్మ చీరెలతోపాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
రుద్రూర్ మండల కేంద్రంలో మహిళలతో బతుకమ్మ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో స్పీకర్ మాట్లాడుతూ.. రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయని చెప్పారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.గతంలో పింఛన్ రూ.రెండు వందలు ఉండగా..కేసీఆర్ ప్రభుత్వం వితంతువులు, వృద్ధులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 అందిస్తున్నారని వివరించారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు బీటీ, సీసీ రోడ్లు, పచ్చదనం, పరిశుభ్రతతో మెరుస్తున్నట్లు చెప్పారు. సమైక్య పాలనలో బతుకమ్మను గుర్తించలేదన్నారు. బతుకమ్మ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఆడపడుచులకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అక్కా చెల్లెళ్లకు ప్రేమతో ఇచ్చే కానుక బతుకమ్మ చీరె అన్నారు. ధర కాదని, ప్రేమ ముఖ్యమన్నారు. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. నియోజకవర్గంలో లక్షా మూ డు వేల మందికి చీరెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 48 లక్షల మందికి పింఛన్లు
ఆసరా పింఛన్ కోసం నెలకు రూ.1,250 కోట్ల చొప్పున ఏడాదికి రూ.15వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్నదని చెప్పారు. మనకన్నా పెద్ద రాష్ర్టాలైన గుజరాత్లో కేవలం 12.49 లక్షల మందికి, మహారాష్ట్రలో31.50 లక్షల మందికి మాత్రమే పింఛన్ ఇస్తున్నారని అది కూడా 75 ఏండ్లు దాటిన వారికి మాత్రమే అని తెలిపారు. తెలంగాణలో 48లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినట్లు చెప్పారు. త్వరలో రూ.మూడు లక్షల స్కీం వస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలో వరి కోతలు ప్రారంభంకానున్నాయని, ధాన్యం కొనుగోలులో రైతున్నలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటారని చెప్పారు.
ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వల్లెపల్లి సునీత, జడ్పీటీసీ శంకర్పటేల్, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్ పటేల్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ఏఎంసీ చైర్పర్సన్ తేళ్ల లావణ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కిశోర్బాబు,విండో చైర్మన్ కూచి సిద్దూ, ఏఎంసీ వైస్ చైర్మన్ లోని జగన్, ఆర్డీవో రాజేశ్వర్, హౌసింగ్ ఏఈ నాగేశ్వరావు, మండల నాయకులు వల్లెపల్లి శ్రీనివాస్, నీరడి గంగాధర్, తేళ్ల అరవింద్, బర్ల మధు, బీర్కూర్ గంగాధర్, తహసీల్దార్ శ్రీకాంత్రావు, ఎంపీడీవో మారుతి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రుద్రూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, ఆర్డీవో రాజేశ్వర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సంగయ్య, కో-ఆప్షన్ మెంబర్ మస్తాన్, తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో బాలగంగాధర్, సర్పంచులు శేఖర్, భాగ్య, ఖాదర్, లక్ష్మణ్, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పొతంగల్ మండలం కావడం ఖాయం
పొతంగల్ కొత్త మండలంగా ఏర్పాటు కావడం ఖాయమని పోచారం స్పష్టం చేశారు. కొత్త మండలం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని తెలిపారు. దీనిపై ఎవరు కూడా రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు.