స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన వేళ.. స్వయం పాలనలో సంక్షేమం విరబూసిన సమయాన.. దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ పోరులో అమరులైన వారి త్యాగాలను స్మరించుకుంటూ ఊరూరా సంబురాలు నిర్వహించనున్నది. తొమ్మిదేండ్ల సుపరిపాలన, సాధించిన ప్రగతిని వివరిస్తూ నేటి నుంచి 21 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది. స్వరాష్ట్రంలో సంక్షేమ పొద్దు పొడిచిన తొలిరోజు నుంచి ఈ తొమ్మిదేండ్ల కాలంలో ప్రగతి ఫలాలు ఊరూవాడ చేరాయి. కేసీఆర్ ప్రభుత్వ పథకాలు గడప గడపకూ అందాయి. ఈ క్రమంలోనే ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రస్ఫుటంగా తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరినీ ఉత్సవాల్లో భాగం చేయనున్నారు. సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక భోజనాల ద్వారా తెలంగాణ దశాబ్ది వేడుకలను సరికొత్తగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
నిజామాబాద్, జూన్ 1, నమస్తే తెలంగాణ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈసారి విభిన్నంగా, వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ కల సాకారమై పదేండ్లు పూర్తయిన నేపథ్యంలో దశాబ్ది వేడుకలను వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసింది. నేటి (శుక్రవారం) నుంచి జూన్ 22వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రస్పుటంగా ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ వేడుకల్లో భాగస్వామ్యం కానున్నారు.
చేపట్టే కార్యక్రమాలివీ…
తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణను సాధించిన దాకా సాగిన పోరాటాల చరిత్రను తెలిపే విధంగా డాక్యుమెంటరీ రూపకల్పన చేసి, జిల్లాల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. జూన్ 2, 2014 నుంచి జూన్ 2, 2023 వరకు స్వయంపాలనలో సాధించిన ప్రగతిని డాక్యుమెంటరీగా చిత్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పిండి వంటలు, ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మిగిలిన జిల్లాల కన్నా మిన్నగా నిజామాబాద్ అభివృద్ధిపై డాక్యుమెంటరీ రూపకల్పనను చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో నిష్ణాతులైన వ్యక్తులకు బాధ్యతలను అప్పగించబోతున్నారు. పౌర సంబంధాల శాఖ సమన్వయం చేయబోతున్నది.
విద్యుద్దీపాలతో అలంకరణ..
ఖలీల్వాడి, జూన్ 1 : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఐడీవోసీ సముదాయంలో శుక్రవారం నిర్వహించే వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
ప్రగతి సాక్ష్యంగా…
అభివృద్ధి సాధించడమే కాకుండా ఆ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందేలా చూడడంలో దార్శనికతను ప్రదర్శిస్తారు. ప్రగతి ప్రస్థానం ఆగకుండా కొనసాగుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణపై నిర్దిష్ట దృక్పథం, దూరదృష్టితో కూడిన సునిశిత కార్యాచరణ కొరవడింది. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దార్శనికతతో కూడుకుని ఉన్నదనడానికి తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతి సాక్ష్యంగా నిలిచింది. తొమ్మిదేండ్లయినప్పటికీ మొదటి సంవత్సరంతో పాటు కరోనా కాలపు రెండేండ్లు కలిపి దాదాపు మూడేండ్ల కాలం వృథాగానే పోయింది. మిగిలిన ఆరేండ్లలో తెలంగాణ ప్రగతిని సాధించిన వైనాన్ని వివరిస్తారు. దేశంలోనే అతి పిన్న వయసు గల రాష్ట్రమైనా.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో అత్యద్భుతమైన ఫలితాలు సాధిస్తూ, ఏకంగా దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ నిలిచింది. మన ప్రగతిని చూసి ఇతర రాష్ర్టాల వారు ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన వారైతే తెలంగాణ సాధిస్తున్న ఫలితాలు, అభివృద్ధిపై అధ్యయనాలు చేస్తుండడం సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శనం.
నేడు జెండా వందనం…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకొని నేడు వాడవాడలా జెండా వందనం జరుగనున్నది. రాష్ట్ర పండుగగా ఆవిర్భావ వేడుక జరుగనున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో నిర్వహించే వేడుకలకు ముఖ్యఅతిథిగా శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హాజరవుతారు. కామారెడ్డి జిల్లాలో చేపట్టిన ప్రగతిపై ప్రసంగిస్తారు. దశాబ్ది వేడుకను పురస్కరించుకొని తొలి రోజు కార్యక్రమాల్లో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని ప్రభుత్వం పేర్కొన్నది.
ఉద్యమ స్ఫూర్తితో పరిపాలన..
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ర్టానికి పది వసంతాలు వచ్చేశాయి. 2014, జూన్ 2న పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడు దేశంలో అన్ని రాష్ర్టాల కన్నా మిన్నగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. దేశానికే ఆదర్శంగా నిలిచి, గెలిచి కొత్త రాష్ట్రం సత్తా చాటుతున్నది. ప్రాణత్యాగానికి సైతం లెక్క చేయక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన సీఎం కేసీఆర్ సంకల్పం, పనితీరు ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అన్నింటా వెనక్కి నెట్టివేయబడిన తెలంగాణ రాష్ట్రం.. ఇప్పుడేకంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కన్నా అన్ని రంగాల్లోనూ మొదటి స్థానంలో దూసుకుపోతున్నది. కేసీఆర్ పరిపాలన దక్షతతో కొత్త జిల్లాలు ఏర్పడడడంతోపాటు పరిపాలన వికేంద్రీకరణకు అచ్చమైన నమూనాగా తెలంగాణ నిలుస్తున్నది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా భౌగోళికంగా విడిపోవడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు వేటికవే అభివృద్ధిలో పోటీపడుతూ అందరి మెప్పును పొందుతున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రశంసలు, పురస్కారాలను దక్కించుకుంటూ.. అమరుల ఆశయాలను నెరవేరుస్తున్నాయి. సబ్బండ వర్గాల సంక్షేమమే ఎజెండాగా కేసీఆర్ సర్కారు అమలుచేస్తున్న విప్లవాత్మకమైన పథకాలతో క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికీ లాభం చేకూరుతుండడం విశేషం. ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పరిపాలనను సాగిస్తూ అమరుల ఆశయాలకు అనుగుణంగా అందరి మెప్పును పొందుతున్నారు.
తెలంగాణ అవతరణ దినోత్సవ
శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్, మంత్రి, కలెక్టర్
ఖలీల్వాడి, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, అనేక త్యాగాల ఫలితంగా ఆరు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఇంటింటికీ రక్షిత తాగునీరు, సాగు జలాలు, సేద్యానికి 24 గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు తదితర అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. పల్లె, ప్టటణ ప్రగతితో గ్రామగ్రామాన పరిశుభ్రత, పచ్చదనం వెల్లివిరుస్తున్నదని, వరుసగా జాతీయ అవార్డులు వరిస్తుండడం తెలంగాణ ప్రగతికి ప్రామాణికంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేండ్ల స్వల్ప వ్యవధిలోనే అనితరసాధ్యమైన అభివృద్ధి, సంక్షేమాన్ని ఆచరణాత్మకంగా నిరూపించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతమైన పాలన దిశగా ముందుకెళ్లాలనే సంకల్పంతో దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నదని వివరించారు. రాష్ట్ర ప్రగతిలో సబ్బండ వర్ణాలు మమేకమవుతూ, దశాబ్ది ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.