‘రైతుబంధు’ పంపిణీకి సర్వం సిద్ధం
ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం
పంటల సాగు సమయంలో చేతిలో చిల్లి గవ్వ లేక రైతాంగం ఆగమాగం
ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్న కేసీఆర్ సర్కారు
ఉమ్మడి జిల్లాలో ఐదున్నర లక్షల మందికి ప్రయోజనం
సీసీఎల్ఏ రికార్డుల ప్రకారం నివేదికలు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ
వానకాలం సీజన్ ప్రారంభమైంది. పంటల సాగులో రైతాంగం నిమగ్నమైంది. విత్తనాలు, ఎరువులు కొనేందుకు చేతిలో డబ్బులు లేక కర్షక లోకం ఇబ్బందులు పడుతున్నది. అయితే, కష్టాల బాటలో ‘సాగు’తున్న రైతన్నకు కేసీఆర్ సర్కారు మొదటి నుంచీ అండగా నిలుస్తున్నది. నాలుగేండ్లుగా పెట్టుబడి సాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సీజన్లోనూ రైతుబంధు నిధులు అందించనున్నది. ఈ నెల 28 నుంచి కమతాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ వేయనున్నది. పెట్టుబడి లేక, మద్దతు ధర దక్కక రైతు పరిస్థితి దయనీయంగా మారిన తరుణంలో సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఆపద్బాంధవుడిగా మారారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు ఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం సాగు ఊపందుకుంటున్న తరుణంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 5.50 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందనున్నది. రైతుబంధు డబ్బులు అందనుండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. వానకాలానికి సంబంధించిన రైతుబంధు సహాయాన్ని ఈ నెల 28 నుంచి రైతులకు అందించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ మిగలకుండా అందరికీ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ డబ్బులు జమ చేయనున్నారు. రైతుబంధు సాయం ప్రకటనతో రైతులంతా హర్షంవ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో ఒకప్పుడు రైతు పరిస్థితి దయనీయం. కాంగ్రెస్, టీడీపీ పాలకుల హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకునే వారే కరువు. సాగుకు యోగ్యమైన భూములున్నప్పటికీ.. సాగు నీరు లేక, కరెంట్ రాక, చేతిలో పెట్టుబడికి పైసలు చాలక… పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. స్వరాష్ట్రంలో ఒక్కో సమస్యను సీఎం కేసీఆర్ శాశ్వతంగా పరిష్కరించారు. రైతును రాజు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో రైతు కేంద్రంగా అనేక పథకాలు అమలవుతున్నాయి. అందులో రైతుబంధు పథకం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రైతులకు భారీ ఉపశమనాన్ని అందిస్తున్నది. అప్పుల బాధతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణను పునర్నిర్మిస్తున్నారు. రైతులకు వెన్నుదన్నుగా ఉండడానికి తీసుకువచ్చిన అనేక రైతు సంక్షేమ పథకాలు ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పంటలు పండించడానికి కావాల్సిన పెట్టుబడి సాయం సహా 24గంటల ఉచిత కరెంట్, సాగునీటి సౌకర్యం, ఎరువులు, విత్తనాల సరఫరా, పంటలకు కనీస మద్దతు ధర వంటి చర్యలతో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వర్గాల నుంచి ప్రశంసలను దక్కించుకుంటున్నది.
జాబితా సిద్ధం..
2018లో మొదలైన ఈ పథకం అప్రతిహతంగా కొనసాగుతున్నది. రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన విప్లవాత్మక స్కీమ్తో ఊరట దక్కుతున్నది. ఇప్పటి వరకు ఏడాదిలో రెండు సీజన్లకు పంట పెట్టుబడికి అందుతున్న ఆర్థిక సాయంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల నుంచి రైతుబంధు పథకానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రపంచంలో రైతులకు ఎదురు పెట్టుబడి ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించే పద్ధతి ఎక్కడా లేదు. కర్షకుల కన్నీళ్లు తుడిచేందుకు సీఎం కేసీఆర్ 2018, మే 10వ తేదీనాడు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లి – ఇందిరానగర్ వద్ద రైతుబంధు పథకాన్ని వానకాలం సీజన్తో ప్రారంభించారు. ఇప్పటి వరకు నాలుగేండ్ల కాలంలో ఎనిమిది విడుతల్లో రైతుబంధు సాయం అందింది. ఇప్పుడు ఐదో ఏటా తొమ్మిదో విడుతగా వానకాలం పంట పెట్టుబడికి సాయం చేసేందుకు సర్కారు సమాయత్తమైంది. జూన్ 28 నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలివ్వడంతో రైతులోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఈ వానకాలానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 54 వేల 155 మంది రైతులకు రూ.265.55 కోట్ల మేర పెట్టుబడి సాయం అందివ్వనున్నారు. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 71వేల 613 మంది రైతులకు రూ.259.86 కోట్లు వెచ్చించబోతున్నారు. కొత్తగా భూ క్రయ, విక్రయాలతో పాస్ పుస్తకాలు పొందిన వారికి రైతుబంధు చెల్లించేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించే అవకాశాలున్నాయి. తద్వార లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే వీలున్నది.
9వ విడుత.. 5వ సంవత్సరం
రైతుబంధు పథకం ఇప్పటి వరకు ఎనిమిది విడుతలుగా అమలైంది. 2018 వానకాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ద్వారా పంపిణీ చేసిన మొత్తం విలువ అర లక్ష కోట్ల రూపాయలు. సీఎం కేసీఆర్ మానస పుత్రికగా కొలుస్తున్న రైతుబంధు పథకం ప్రతి రైతునూ టచ్ చేస్తున్నది. రైతు సాధక బాధకాలను దగ్గరుండి చూసిన వ్యక్తిగా, స్వయంగా రైతుగా ఎదుర్కొన్న అనుభవాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సాయాన్ని తీసుకువచ్చారు. రైతుకు పైసలిచ్చి సాగుకు ప్రోత్సాహం అందించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అని చెప్పక తప్పదు. సీఎం కేసీఆర్ చొరవతో దిగ్విజయంగా అమలవుతున్న రైతుబంధు ద్వారా అనేక మంది కర్షకుల కన్నీళ్లు, కష్టాలను పోగొట్టాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రైతుబంధు ద్వారా ప్రతి సీజన్లో సుమారుగా ఐదున్నర లక్షల మందికి వందలాది కోట్ల రూపాయల నిధులను సర్కారు వెచ్చిస్తున్నది. సాగు భూమి ఉండి… పట్టాదారు పాస్బుక్కులు కలిగి ఉన్న వారందరికీ పెట్టుబడి సాయం అందుతున్నది. 9వ విడుత పెట్టుబడి సాయంతో ఐదో సంవత్సరంలోకి రైతుబంధు పథకం ప్రవేశించింది.
రైతుబంధు ముచ్చట ఆనందాన్నిచ్చింది
సీఎం కేసీఆర్ చేసిన రైతుబంధు ప్రకటన ఆనందాన్నిచ్చింది. ఆయన ఈ ముచ్చట చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నాలాంటి రైతులు ఎంతో మంది ఈ వార్తను విని సంతోషించి ఉంటారు. సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు చల్లగా ఉండాలి.
– రాణంపల్లి పీరయ్య, రైతు, బీర్కూర్
సరైన టైంలో ఇస్తుండు..
వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నం. ఈ టైంల సీఎం కేసీఆర్ రైతుబంధు సాయం ఇస్తుండడం మా రైతులందరికీ తీపికబురే. సీఎం కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ప్రతి పంటకూ ఎకరానికి ఐదు వేలు ఇస్తున్నడు. ఆ డబ్బులే పొలం వేసేందుకు ఉపయోగపడుతున్నాయి. ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాం కానీ.. ఎవ్వరూ ఇలా పెట్టుబడి సహాయాన్ని ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ ఇస్తున్నడు.. సంతోషంగా ఉంది.
– యామ హన్మాండ్లు, రైతు, బీర్కూర్
అర్హులందరికీ రైతుబంధు
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందిస్తాం. సీసీఎల్ఏ రికార్డులను అనుసరించి పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపించాం. కొత్తగా భూ క్రయ, విక్రయాలు జరిగిన వాటికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
– ఆర్.తిరుమల ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి, నిజామాబాద్