న్యూఢిల్లీ, ఆగస్టు 4: దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎగదోయవచ్చని ఓ తాజా నివేదికలో బజాజ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అంచనా వేసింది. మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా లేక అన్ని రకాల ఉత్పత్తుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నిజానికి ఇప్పుడు వర్షాలు ఊపందుకున్నా.. ఆలస్యం గా పడుతుండటంతో పంటల సాగు అంతటా రిస్కులో పడింది. ఈ క్రమంలోనే ఈసారి ఆశించిన స్థాయిలో దిగుబడులు ఉండకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే పెరిగిన ధరలు
వర్షాభావ పరిస్థితుల ప్రభావం.. మార్కెట్పై ఇప్పటికే కనిపిస్తున్నది. రకరకాల కూరగాయలు, పప్పులు, వంటనూనెల రేట్లు భగ్గుమంటున్నాయి. ఇక అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షో భం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల విజృంభణకు దారితీసింది తెలిసిందే. దేశీయంగా పెట్రో ఉత్పత్తుల రేట్లూ పెరిగాయి. ఇది రవాణా చార్జీలను భారం చేయగా.. ఆ మేరకు కొనుగోలుదారులపై వస్తుత్పాదక కంపెనీలు వడ్డింపులూ చేశా యి. ఈ నేపథ్యంలో ఎల్ నినో దెబ్బకు వర్షాభావ పరిస్థితులు.. ఇంకా ద్రవ్యోల్బణాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి.
కొనుగోలు శక్తిపై..
రైతుల ఆదాయం, గ్రామీణ వినియోగదారుల కొనుగోలు శక్తి.. వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు సమృద్ధిగా కురువకపోయినా, ఆలస్యంగా కురిసినా.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో మెజారిటీ ప్రజానీకం గ్రామాల్లోనే నివసిస్తుండగా.. వారి ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. ఇక ఆ వ్యవసాయంలో అత్యధిక శాతం వర్షాధారమే కావడంతో ఇప్పుడు వర్షపాతంపైనే దేశ జీడీపీ వృద్ధిరేటు కూడా ఆధారపడి ఉందని చెప్పకతప్పదు. ఇదిలావుంటే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం క్రమేణా పెరుగుతున్నది. ఈ ఏడాది జూన్లో 4.4 శాతం వరకు నమోదైంది. ఇం దులో ఆహార ద్రవ్యోల్బణం వాటా ఎక్కువేనన్నది మరువద్దని ఎక్స్పర్ట్స్ గుర్తుచేస్తున్నారు.