హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తేతెలంగాణ): ‘ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు.. సీఎం రేవంత్రెడ్డికి చెంపపెట్టు’ అని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పిటిషనర్ పాడి కౌశిక్రెడ్డి అభివర్ణించారు. ఇది రెండున్నరేండ్లుగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి దక్కిన ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. తెలంగాణభవన్లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చారిత్రక తీర్పు ఇచ్చిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను ఎల్లకాలం మోసం చేయవచ్చని భావించిన ముఖ్యమంత్రి రేవంత్కు హైకోర్టు తీర్పు బ్రేక్ వేసిందని అన్నారు.
దానం తరహాలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన మిగిలిన ఎనిమిది మందిపై కూడా వేటు పడటం ఖాయమని జోస్యం చెప్పారు. వారి నియోజకవర్గాల్లోనూ ఉపఎన్నికలు తప్పవని కుండబద్దలు కొట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలది ఏ పార్టీయో చెప్పుకోలేని దుస్థితి అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లోగా జరుగనున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ నేతృత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పార్టీ మారిన కడియం శ్రీహరిది అనైతికమా? లేక తనదా? ఎథిక్స్ కమిటీ తేల్చాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి ముసుగులో పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్కు బుద్ధిచెప్పి.. 420 హామీ లిచ్చి మోసం చేసిన అధికార కాంగ్రెస్కు కర్రుకాల్చివాత పెట్టాలని కౌశిక్రెడ్డి ఖైరతాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘దానం నాగేందర్ ఫైటర్ కాదని, పక్కా చీటర్’ అని విరుచుకుపడ్డారు. ఓటేసిన ప్రజలను వంచించిన ఆయనకు బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కేసీఆర్ నేతృత్వంలో ఖైరాతాబాద్ గుడ్డపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. దానం నాగేందర్కు పట్టిన గతే మిగిలిన ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పడుతుందని హెచ్చరించారు.