ఖలీల్వాడి, నవంబర్ 24: ‘ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రతిరోజూ ధర్నాలు, ఆందోళన చేసేవాళ్లం. పోలీసులు వచ్చి మాపై లాఠీ దెబ్బలు కొట్టి, ఈడ్చుకుపోతుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులెవరూ ముందుకురాలేదు. అలా చూస్తుండిపోయారు. మా పోరాటం తెలంగాణ కోసమని అన్ని బాధలు భరించాం..ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రత్యేక రాష్ట్రం రావడంతో సీఎం కేసీఆర్ తెలంగాణను పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి అందరి కండ్ల ముందు కనిపిస్తున్నది. ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.’ అని తెలంగాణ ఉద్యమకారుడు సత్యప్రకాశ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.. ఆయన మాటల్లోనే..
కుటుంబానికి ఎన్నో రోజులు దూరంగా ఉన్నాం
తెలంగాణ ఉద్యమ సమయంలో కుటుంబానికి ఎన్నోరోజులు దూరంగా ఉన్నాం. ఎక్కడ ఏం జరిగినా పోలీసులు మమ్మల్ని ఉదయం స్టేషన్కు తీసుకెళ్లి రాత్రి వదిలేసేవారు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు. భార్య, ఇద్దరు పిల్లల్ని వదిలి ఉద్యమంలో పాల్గొన్నా. ఉద్యమ సమయంలో నాపై 180 కేసులు పెట్టారు. జైలుకు పంపించారు. ఒక వేళ తెలంగాణ రాకుంటే నా జీవితం జైలుపాలయ్యేది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసినన్నీ రోజులు కేసులు పెడుతూ, కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. మొట్టమొదటి సారిగా జైలుకు వెళ్లింది నేనే. కొంతమంది ఎందుకు నీ జీవితం నాశనం చేసుకుంటావ్ అని నన్ను అనేవారు. కానీ నేను ఏమైనా సరే తెలంగాణ వచ్చే వరకు కొట్లాడుతా అని ప్రతి ధర్నాలో పాల్గొనేవాడిని.
రాష్ట్రం వచ్చింది అభివృద్ధి చేసుకోవడానికి..
తెలంగాణ సాధించుకున్నది అభివృద్ధి చేసుకోవడానికి. ఇతర పార్టీలు దోచుకోవడానికి కాదు. గతంలో తెలంగాణ ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో అందరూ తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ తెలంగాణ ప్రజలు 40 ఏండ్లు వెనక్కి పోవాల్సి వస్తుంది. తెలంగాణపై పక్క రాష్ట్రం నాయకుడి పెత్తనం ఏంటి. ఇక్కడ ఏం చేయాలని వస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక మనమీద పడుతున్నారు. కానీ ఇక్కడి ప్రజలు ఊరుకోరు.. డొక్కతీసి డోలు కడుతారు. కాంగ్రెస్ నాయకుల బూటకపు హామీలను ప్రజలు, రైతులు నమ్మే స్థితిలో లేరు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఉన్నారు. నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎక్కడ పడుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్రకు పోతుంటే ఏం చేశారు. ఉద్యమంలో 180 కేసులు పెట్టారు. లాఠీ దెబ్బలు తగిలి తీవ్ర గాయాల పాలయ్యాం. జైలుకు కూడా పంపించారు. ప్రస్తుతం పచ్చగా ఉన్న తెలంగాణను నాశనం చేయడానికి మళ్లీ వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్పార్టీ ఎత్తుగడలు వేస్తూ ఇక్కడ తిష్ట వేయడానికి వస్తున్నాయి.ఆ పార్టీలకు అంత సీన్లేదు ఇక్కడ. పనికి మాలిన పార్టీలన్నీ తెలంగాణ మీద పడ్డాయి. అభివృద్ధిలో భాగంగా నిజామాబాద్లో ఐటీ హబ్ ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దొరికాయి. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా విదేశాల్లో వ్యాపారాలను వదులుకొని ఇందూరుకు వచ్చి సేవలు అందిస్తున్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.పదేండ్లలో ఇందూరు నగరం ఎంతో అభివృద్ధి చెందింది. బొడ్డెమ్మ చెరువును మినీ ట్యాంక్బండ్గా మారుస్తారని ఎవరూ ఊహించలేదు.కాంగ్రెస్ నాయకులు చేతకాక అండర్ గ్రౌండ్ డైనేజీ నిర్మాణ పనులను మధ్యలో వదిలేశారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల.. సీఎం కేసీఆర్తో మాట్లాడి యూజీడీ పనులను పూర్తిచేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించారు.
ఇందూరు పదేండ్ల క్రితం ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇంత అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం.