తాళ్లరాంపూర్ రైతుల డిమాండ్
విండో మాజీ చైర్మన్ ఇంటి ఎదుట బాధితుల ఆందోళన
ఏర్గట్ల, మే 24 : తాళ్లరాంపూర్ సొసైటీలో డబ్బులను డిపాజిట్ చేసిన తమకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలో తాళ్లరాంపూర్ విండో మాజీ చైర్మన్ సోమచిన్న గంగారెడ్డి ఇంటి ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. విండోలో జరిగిన నిధుల దుర్వినియోగంపై ఆధికారులు సమగ్ర విచరణ చేపట్టి, అవకతవకలతోపాటు బాధ్యులను గుర్తించిన విష యం తెలిసిందే.
ప్రస్తుత పాలకవర్గంతోపాటు డిపాజిట్దారులు కలిసి విండో మాజీ చైర్మన్, మాజీ కార్యదర్శిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మాజీ చైర్మన్ కనిపించకపోవడంతో డిపాజిట్దారులతోపాటు సొసైటీ పరిధిలోని రైతులు ఆయన ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. విండోలో జరిగిన అవకతవకల నేపథ్యంలో క్రిమినల్ కేసు నమోదవుతుందని మాజీ చైర్మన్ పరారయ్యాడని అన్నారు. మాజీ చైర్మన్ను అరెస్టు చేసి తమ డిపాజిట్ సొమ్ము ఇప్పించాలని అధికారులను కోరారు.