భీమ్గల్ మండలంలోని పల్లికొండ ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు. ఈ పాఠశాలలో 395 విద్యార్థులు చదువుతున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు, ప్రతి తరగతిలో రెండు సెక్షన్లు ఉన్నాయి. చుట్టు పక్కల బాచన్పల్లి, పురాణీపేట్, లింగాపూర్ గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఈ పాఠశాలకు చెందిన చాలా మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ సెమినార్, సైన్స్మీట్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.
పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఇస్రో అవార్డులు అందుకున్నారు. సైన్స్ కాంగ్రెస్లో పాల్గొన్న రెండుసార్లూ ఉత్తమ ప్రతిభచూపి గణితం టాలెంట్ టెస్టులో జిల్లాస్థాయి ప్రథమ బహుమతి సాధించారు. విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే ఉద్దేశంతో కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు పాఠశాలలో ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. షూటింగ్బాల్, నెట్బాల్ క్రీడల్లో తర్ఫీదునిస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. 22మంది విద్యార్థులు షూటింగ్ బాల్లో రాష్ట్రజట్టుకు, 31విద్యార్థులు నెట్బాల్లో రాష్ట్రజట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఇదే పాఠశాలకు చెందిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు గంగామోహన్కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతోపాటు ఐడియల్ టీచింగ్ అవార్డులను అందుకున్నారు.
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు. సర్కారు బడుల్లో అరకొర సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరతతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఉదాహరణే మండలంలోని పల్లికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల.
-భీమ్గల్, డిసెంబర్ 29
సర్కారు సౌకర్యాలతోనే..
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో బడులు మెరుగుపడ్డాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి అన్నిరంగాల్లో రాణించేలా చూస్తున్నాం. చదువుతోపాటు ఆటల్లోనూ మా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ చూపుతున్నారు.
– హరినాథ్, హెచ్ఎం,
పల్లికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల
తరగతి గదిలో ప్రయోగాలపై మెలకువలు నేర్పుతున్న టీచర్
రాష్ట్ర,జాతీయ స్థాయిలో ప్రతిభ..
సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ప్రతిభదాగి ఉన్నది. దానిని వెలికి తీసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. బడులను బలోపేతం చేస్తుండడంతోపాటు మౌలిక వసతులు కల్పించడంతో మెరుగైన విద్యాబోధన అందుతున్నది. దీంతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభచాటుతున్నారు.
– గంగామోహన్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు
అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా..
మా పాఠశాల నుంచి చాలా మంది పిల్లలు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. షూటింగ్బాల్ క్రీడలో ఎక్కువ మంది పాల్గొనేలా కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయికి పల్లికొండ పాఠశాల విద్యార్థులు ఎదిగేలా చేయడమే నా లక్ష్యం.
– డి. రమేశ్ గౌడ్, పీఈటీ
రాష్ట్రస్థాయి గణిత పరీక్షలోనూ..
ప్రతిభచాటిన పల్లికొండ పాఠశాల విద్యార్థినులు
రాష్ట్ర విద్యాశాఖ, తెలంగాణ గణిత ఫోరం సంయుక్తంగా ఈనెల 27న నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షలో పల్లికొండ ఉన్నత పాఠశాలకు చెందిన డి.హర్షిణి 3వ స్థానం దక్కించుకున్నది. ఈ నెల 17న జిల్లాస్థాయిలో నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్షలో మొదటి స్థానంలో నిలువగా, మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్షలో హర్షిణి మొదటి స్థానం దక్కించుకోగా ఇదే పాఠశాలకు చెందిన శ్రీలేఖ రెండోస్థానం దక్కించుకున్నది. గురువారం విద్యార్థినులు హర్షిణి, శ్రీలేఖ, గణిత ఉపాధ్యాయులు రాజన్న, ఎం.సత్యనారాయణలను ప్రధానోపాధ్యాయుడు హరినాథ్, ఎస్ఎంసీ చైర్మన్ గంగాధర్, పల్లికొండ సర్పంచ్ యమునాగంగారాం, ఎంపీటీసీ కృష్ణ, ఎస్ఎంసీ సభ్యులు జి.ప్రసాద్, ఉపాధ్యాయులు సన్మానించారు.