నిజామాబాద్, సెప్టెంబర్ 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10కోట్లు విడుదల చేసిందని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి అనిల్ కుమార్ పేరిట ఉత్తర్వులు వెలువడినట్లు చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పలు ఆలయాలకు విడుదలైన నిధుల వివరాలను వెల్లడించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లోని గ్రామాల్లోని పాత ఆలయాల పునర్నిర్మాణం కోసం, నూతన ఆలయాల అభివృద్ధికి రూ.10కోట్లు వెచ్చించబోతున్నట్లుగా గంప గోవర్ధన్ వెల్లడించారు. ఇంతకు మునుపు రూ.28కోట్లు ప్రకటించగా ప్రస్తుతం రూ.10కోట్లు విడుదలైనట్లు తెలిపారు.
మొత్తంగా రూ.38కోట్లు నిధులు మంజూరైనట్లు చెప్పారు. కామారెడ్డి మండలానికి రూ.62 లక్షలు, కామారెడ్డి పట్టణానికి రూ.1.14కోట్లు, రాజంపేట మండలానికి రూ.35లక్షలు, రామారెడ్డి మండలానికి రూ.47 లక్షలు, బీబీపేట్ మండలానికి రూ.49లక్షలు, దోమకొండ మండలానికి రూ.87లక్షలు, మాచారెడ్డి మండలానికి రూ.2.38 లక్షలు, భిక్కనూర్ మండలానికి రూ.3.64 లక్షలు కలిపి మొత్తం రూ.10 కోట్ల విడుదలైనట్లు వివరించారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానించి పనులు చేపడుతామని తెలిపారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మాచారెడ్డి, కామారెడ్డి ఎంపీపీలు లోయపల్లి నర్సింగరావు, పిప్పిరి ఆంజనేయులు, మాచారెడ్డి జడ్పీటీసీ రాంరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మామిండ్ల అంజయ్య పాల్గొన్నారు.
ఆలయాలకు పునరుజ్జీవం…
ప్రభుత్వం నిధులను కేటాయించడంతో నియోజకవర్గంలోని పాత దేవాలయాలకు మహర్దశ పట్టింది. ప్రస్తుతం అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్న ఆలయాలన్నీ పునరుజ్జీవానికి నోచుకోనున్నాయి. కామారెడ్డి మండలంలోని 19 ఆలయాలు, కామారెడ్డి పట్టణంలో 23, రాజంపేట మండలంలోని 9, రామారెడ్డి మండలంలో 12, బీబీపేట మండలంలో 15, దోమకొండ మండలంలో 30, మాచారెడ్డి మండంలో 19, భిక్కనూర్లోని 26 ఆలయాలకు నిధులు మంజూరు అయ్యాయి.
విప్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ శివారులో ఉన్న నల్లకుంట కట్టమైసమ్మ ఆలయ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విప్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.