రాములోరి కల్యాణంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పులకించిపోయింది. శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణ క్రతువు కన్నుల పండువగా సాగింది. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రామనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. బాన్సువాడ పట్టణంలోని శ్రీరామాలయం, మార్కండేయ మందిరాల్లో నిర్వహించిన వేడుకల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు. పోచంపాడ్లోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవంలో మంత్రి ప్రశాంత్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. నిజామాబాద్లో భారీ శోభాయాత్ర నిర్వహించారు.
నిజామాబాద్, మార్చి 30 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలు గురువారం కన్నుల పండువగా సాగాయి. ఆలయాల్లో సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రామనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీరామాలయం, మార్కండేయ మందిరం, పోచారంలోని రామాయంలో నిర్వహించిన వేడుకల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు. పోచంపాడ్లోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.
పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు పంపిన ఎమ్మెల్సీ కవిత
శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరాలంగానే ఈ ఏడాది కూడా పలు ఆలయాలకు ఎమ్మెల్సీ కవిత పట్టు వస్త్రాలు, తలంబ్రాలు పంపారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రామాలయం, ఆర్మూర్ సిద్ధుల గుట్ట, బోధన్ రామాలయం, డిచ్పల్లి ఖిల్లా రామాలయం, పోచంపాడ్ గోదవరి తీరాన ఉన్న కోదండ రామాలయాల్లో ఎమ్మెల్సీ తరఫున ప్రతినిధులు పట్టు వస్ర్తాలను అందజేశారు.