ఖలీల్వాడి, మార్చి 3: నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను వేగవంతం చేసింది. వందశాతం వసూలు చేయాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని, ఆ దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. ఆస్తి పన్ను వసూలులో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది బిజీగా ఉండడంతో ఆస్తి పన్ను వసూలుకు బ్రేక్ పడినట్లయ్యింది. త్వరలో లోక్సభ ఎన్నికల జరగనుండడంతో అంతలోపే ఆస్తి పన్ను వసూలు చేయాలని మున్సిపల్ అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు.
ఆస్తి పన్ను వందశాతం వసూలు చేయడమే లక్ష్యం గా నగరపాలక సంస్థ అధికారులు ముందుకెళ్తున్నా రు. దీనికితోడు ఆస్తి పన్నులో 90శాతం వడ్డీని మా ఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆఫర్ను ఈనెలాఖరు వరకు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.పదిశాతం మాత్రమే వడ్డీ చెల్లించేలా వెసులుబాటు కల్పించి, యజమానులకు ఊరటనిచ్చింది. నిజామాబాద్ నగరపాలక సంస్థకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 43 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా..ఇప్పటివరకు రూ. 33 కోట్లు వసూలయ్యాయి. ఈ నెలాఖరు వరకు రూ.10 కోట్లు వసూలు చేయాలనే లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించుకున్నారు. ప్రభుత్వ కల్పిస్తున్న వడ్డీ రాయితీని నగరవాసులకు తెలిసేలా ప్రచారం నిర్వహిస్తున్నారు.నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో 82వేల గృహ, వాణిజ్య సముదాయాల నుంచి ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది.
కార్పొరేషన్ పరిధిలో కొత్తగా తీసుకొచ్చిన భువన్ యాప్ ద్వారా ఆరు వేల సముదాయాలను పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. అదనంగా గదులు నిర్మించినా, ఒక భవంతిపై మరో భవంతి నిర్మించినా ఈ యాప్ ద్వారా కార్యాలయం నుంచే గుర్తిం చి పన్ను సవరించే అవకాశం ఉన్నది. ఈ విధంగా అదనంగా రూ. 5కోట్ల నుంచి రూ.6కోట్లు వసూలు చేయాల్సి ఉందని గుర్తించారు. నగరపాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లలో 28 మంది రెవెన్యూ సిబ్బంది, 16 మంది బిల్లు కలెక్టర్లు ఉన్నారు. జో న్-3, జోన్-5 పరిధిలోకి వచ్చే మైనారిటీ ప్రాం తంలో ఇద్దరు ఆర్ఐలతో స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరులోపు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేవిధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. వడ్డీ రాయితీతో మరింత ఆదాయం రానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నిజామాబాద్ నగరంలో వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేసి రాష్ట్రంలో టాప్వన్గా నిలుస్తాం. ఇప్పటికే రూ.33 కోట్లు వసూలు చేశాం.మొండి బకాయిలను వసూలు చేయడంలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. ఈ నెలాఖరువరకు ప్రభుత్వం కల్పించిన వడ్డీ రాయితీని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
– మకరంద్, కమిషనర్, నగరపాలక సంస్థ నిజామాబాద్