నేరడిగొండ, జూలై 27 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గిరిజనులు అత్యధిక జనాభా ఉన్నారని, ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా వసతులు కల్పించాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లో ఆరోగ్యశాఖపై మంత్రి దామోదర రాజనరసింహా, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బోథ్లో 100 పడకల ఏరియా ఆసుపత్రికి భవనం సిద్ధంగా ఉందని.. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు లేక పోవడంతో వైద్య సేవలు అందడం లేదన్నారు. వెంటనే క్యాడర్ పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఇచ్చోడ పీహెచ్సీని 30 పడకల సీహెచ్సీగా అప్గ్రేడ్ చేసి అదనపు సిబ్బంది మంజూరు చేయాలని కోరారు. నేరడిగొండ పీహెచ్సీ పరిధిలో 80 శాతం గిరిజనులు నివసిస్తున్నారని, ప్రస్తుతం పీహీచ్సీలో ఐపీ సదుపాయం లేదని తెలిపారు.
ప్రసూతి అత్యవసర కేసులకు 40 కి.మీ. ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. దీనికి రూ.6 కోట్ల అంచనాతో 30 పడకల ఐపీ భవనం మంజూరు చేయాలని కోరారు. బోథ్ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభించుట.. ఇచ్చోడలో నూతన డయాలసిస్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు. అలాగే బోథ్లోని 100 పడకల ఆస్పత్రిలో 10 బెడ్లతో కూడిన ట్రౌమా కేర్ సెంటర్, ఐసీయు, ఓటీతో మంజూరు చేయాలన్నారు. వాంకిడి , బోథ్ ఎక్స్రోడ్డు, సీతాగోంది, మన్నూర్, సొనాల బ్లాక్ స్పాట్లని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా 108 అంబులెన్స్ మంజూరు చేయాలని విన్నవించారు. ఈ అంశాలన్నీ బోథ్ నియోజకవర్గంలో గిరిజన ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నాయని, ప్రాధాన్యత పరిగణించి తక్షణ ఆమోదం తెలిపి ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని కోరారు.