మంజీరలో ఏడాది పొడవునా నీళ్లు
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
నదిలో నీటి నిల్వల పరిశీలన
మంజీర నదిపై చెక్డ్యామ్ల నిర్మాణం ద్వారా ఏడాది పొడవునా నదిలో నీళ్లు నిలిచి ఉంటాయని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చెక్డ్యామ్ల నిర్మాణం రైతులకు వరంగా మారుతున్నదని చెప్పారు. బుధవారం బాన్సువాడ-బిచ్కుంద మార్గంలోని వంతెన పైనుంచి మంజీర నదిలో నిలిచిన నీటిని స్పీకర్ పరిశీలించారు. చెక్డ్యామ్ల నిర్మాణంతో నాలుగు కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచి ఉంటాయన్నారు.
బాన్సువాడ, జూన్ 22 : మంజీరా నదిలో నిర్మిస్తున్న చెక్డ్యామ్లు బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల రైతులకు వరాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ-బిచ్కుంద రహదారిపై ఉన్న మంజీరా బ్రిడ్జి పైనుంచి.. నదిలో నీటి నిల్వను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ పట్టణ పరిధిలోని చింతల నాగారంలో రూ.15 కోట్లతో నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు చివరిదశకు చేరుకున్నాయని తెలిపారు.
భారీగా వరదలు, నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు తెరిచినప్పుడే నదిలో నీటి ఉధృతి కనిపించేదని అన్నారు. చెక్ డ్యామ్ నిర్మాణంతో కొద్దిరోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే నదిలో నీళ్లు నిలిచాయని తెలిపారు. నదిలో చెక్ డ్యామ్లు నిర్మించి గోదావరిలోకి వృథాగా పోయే నీటిని బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల రైతులకు అందేలా చూస్తున్నామని చెప్పారు. ఒక్కో చెక్డ్యామ్ నిర్మాణంతో నాలుగు కిలోమీటర్ల మేర నీళ్లు నిల్వ ఉంటాయని, దీంతో మంజీరా నది ఏడాది పొడుగునా నిండుగా కనిపిస్తుందని అన్నారు.