బాన్సువాడ టౌన్, నవంబర్ 2 : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయం వద్ద రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శ్రీ క్షేత్రం నాచారం పీఠాధిపతి మధుసూదానంద సరస్వతీ స్వామీజీతో అయ్యప్ప మాలధారుల మహాపాద యాత్రను బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ చాలామంది పాదయాత్రలు చేస్తారని, కానీ అయ్యప్ప మాలధారులు చేసే ఈ మహా పాదయాత్ర లోక కళ్యాణం కోసం చేస్తున్నదని అన్నారు. సుమారు 250 మందితో ఈ పాదయాత్ర కొనసాగడం చాలా గొప్ప విషయమని.. ఇందులో బాన్సువాడకు చెందిన 120 మంది అయ్యప్ప మాలధారులు పాల్గొనడం చాలా సంతోషకరమన్నారు. ఈ మహాపాద యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర దిగ్విజయంగా సాగి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంతోషంగా ఇండ్లకు చేరుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
ప్రతి సంవత్సరం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి తనను ఆహ్వానించి కార్యక్రమాన్ని చూసే భాగ్యం కల్పిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు. పాదయాత్రలో భాగంగా దారి ఖర్చుల కోసం రూ. 2 లక్షలు అయ్యప్ప మాలధారులకు అందజేశారు. అనంతరం అయ్యప్ప మందిరం వద్ద స్వాముల కోసం రూ.15 లక్షలతో నిర్మించిన స్నానపు గదులు, మరుగుదొడ్లను స్పీకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, హనుమాన్ వ్యాయామశాల చైర్మన్ గురు వినయ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, సభాపతి వ్యక్తిగత సహాయకుడు భగవాన్ రెడ్డి, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు విఠల్ రెడ్డి, నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.