నిజాంసాగర్, జూన్ 23: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద వానకాలం పంటల సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. పంట సాగుకోసం ఈనెల 21న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే హన్మంత్షిండే నీటి విడుదలను ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ కింద 1.75లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను మొదటి ఆయకట్టు ప్రాంతంలోని 1.30లక్షల ఎకరాలకు ఎలాంటి ఢోకాలేదు. గతేడాది వానకాలంలో విస్తారంగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వానకాలం పంటలు గట్టెక్కడంతో యాసంగి పంటల సమయానికి ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. యాసంగి పంటలకు అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.15 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించారు. సీఎం కేసీఆర్ చొరవతో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్కు తీసుకురావడంతో యాసంగిలో నిజాంసాగర్ ఆయకట్టు కింద పంటలను పూర్తిస్థాయిలో సాగుచేశారు. ప్రస్తుతం వానకాలం పంటల సాగుకోసం ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో నీటి విడుదల చేపట్టారు. దీంతో మొదటి ఆయకట్టు కింద రైతన్నలు తుకాలు సిద్ధం చేస్తుండగా బాన్సువాడ, బీర్కుర్, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, బోధన్ ప్రాంతాల్లో అక్కడక్కడ నాట్లు కూడా వేసుకుంటున్నారు. వానకాలంలో ఆయకుట్ట కింద లక్షా 30వేల ఎకరాలకు 9 టీఎంసీల నీరు అవసరం ఉండగా ప్రస్తుతం 5 టీఎంసీలు ఉన్నా యి. మరో నాలుగు టీఎంసీల నీరు కొండపోచమ్మ సాగర్ లేదా సింగూరు నుంచి తీసుకొని ఆయకట్టుకు నీటిని అందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
ప్రధాన కాలువ ద్వారా నీరు
వానకాలంలో ముందస్తు సాగుకు అధికారులు ప్రోత్సహిస్తుండంతో రైతన్నలు కూడా ఎన్నడూలేని విధంగా సాగుకు సిద్ధపడుతున్నారు. బోధన్, కోటగిరి, నస్రుల్లాబాద్, వర్ని, బీర్కూర్, రుద్రూర్ ప్రాంతాల్లో నారమళ్లు సిద్ధం చేసుకోవడంతోపాటు కొంత మంది రైతులు నాట్లు కూడా వేస్తున్నారు. ఇక బోరు బావులు ఉన్న రైతులు ఈ పాటికే చాలా మంది నాట్లు వేసుకోవడంతో పాటు నారమళ్లు సిద్ధం చేసుకున్నారు. రెండు రోజులుగా నిజాంసాగర్ నీటిని ప్రధాన కాలువ ద్వారా విడుదల చేపట్టడంతో ఆయకట్టు కింద రైతన్నలు ఉత్సాహంగా సాగులో నిమగ్నమయ్యారు. వర్షాలకోసం ఆకాశం వైపు చూపులు చూడడం వర్షాలు కురిస్తేనే నారుమడిని సిద్ధం చేసుకోవడం, నాట్లు వేయడం ఇదంతా ఒకప్పుడని.. ఇప్పుడు సీఎం కేసీఆర్ చొరవతో వానలు కురియకముందే పంటల సాగుకు శ్రీకారం చుట్టామంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ సార్ వల్లే ప్రాజెక్టులో నీళ్లు..
నిజాంసాగర్ ఆయకట్టు కింద పంటలు సాగు చేస్తే చేతికందే వరకూ అనుమానంగానే ఉండేది. వర్షాలు కురిసి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లుతుంటే నిజాంసాగర్లోకి మాత్రం చుక్క నీరు వచ్చేది కాదు. నిజాంసాగర్, సింగూరు ఎగువ భాగంలో ఎన్నో అక్రమ ప్రాజెక్టులు కట్టడంతో నిజాంసాగర్ కొన్ని సంవత్సరాల నుంచి బోసిపోతుంది. అలాంటిది కేసీఆర్ సారు వల్ల కాళేశ్వరం నీరు నిజాంసాగర్కు రావడం ,ఈ సమయంలో సైతం నిజాంసాగర్లో నాట్లు వేసుకునేందుకు నీరు నిల్వ ఉండడం నీటిని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.
– రౌతు పోచయ్య, రైతు, తున్కిపల్లి గ్రామం
తొమ్మిది టీఎంసీల నీరు అవసరం
నిజాంసాగర్ ఆయకట్టు కింద అలీసాగర్ వరకు లక్షా 30వేల ఎకరాల ఆయకట్టుకు 9 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 టీఎంసీలకు గాను 1391.70 అడుగులు 4.82 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. వర్షాలు లేకుంటే నిజాంసాగర్ నీటి విడుదల అనంతరం కొండపోచమ్మసాగర్, సింగూరు నుంచి నీటిని తీసుకువచ్చి ఆయకట్టు రైతులకు అందిస్తాం. జూన్లోనే ఆయకట్టు కింద రైతన్నలు సాగుకు శ్రీకారం చుట్టడం, కొంత మంది రైతులు నాట్లు వేస్తూ ముందస్తు సాగుకు శ్రీకారం చుట్టారు. ఆయకట్టు కింద సాగవుతున్న పంటలకోసం మొత్తం ఆరు విడుతల్లో నీటిని 1500 క్యూసెక్కుల చొప్పున విడుతల వారీగా విడుదల చేస్తాం.
–సొలోమాన్, నీటి పారుదల శాఖ, ఈఈ