బాన్సువాడ రూరల్, అక్టోబర్ 20 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నా బలగం.. బలం అని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టిస్తానని రాష్ట్ర శానససనభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామ సమీపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ల వారీగా బూత్ లెవల్ నాయకులు, కార్యకర్తలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై బోర్డుపై క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో తొమ్మిది సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రూ. 10 వేల కోట్ల నిధులు తీసుకొచ్చి, బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. నియోజకవర్గంలో 258 పోలింగ్ బూత్లు ఉన్నాయని, ప్రతి పోలింగ్ బూత్కు ఇద్దరిని ఇన్చార్జిలుగా నియమించినట్లు చెప్పారు. ప్రజలకు బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను వివరించి చెప్పాలన్నారు. మ్యానిఫెస్టో కరపత్రం ప్రతి ఇంటికీ చేరాలన్నారు. ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసేలా అందరిని పోలింగ్ బూత్కు తీసురావాలని సూచించారు. ప్రజలు కోరుకుంటున్నట్లు అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు ఇచ్చి అమ్మడానికి, కొనడానికి మార్పులను రైతులకు వివరించాలని చెప్పారు.
నియోజకర్గంలో మొత్తం 258 బూత్లు ఉండగా, 1.92 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. సాగు నీటి రంగం అభివృద్ధి కోసం రూ. వేయి కోట్లు, రోడ్ల అభివృద్ధికి రూ. వేయి కోట్లు, మిషన్ భగీరథకు రూ. 500 కోట్లు, విద్యకు రూ.400 కోట్లు, వైద్యానికి రూ. 200 కోట్లు, విద్యుత్కు రూ. 250 కోట్ల చొప్పున ఖర్చు చేశామని చెప్పారు. మనం చేసిన అభివృద్ధి, సేవలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు. సర్వే ప్రకారం బాన్సువాడ నియోజకవర్గంలో 76 శాతం ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందన్నారు. ఆరు నెలల క్రితం 62 శాతం ప్రజామోదం ఉండగా, ఇప్పుడు 76 శాతానికి పెరిగిందన్నారు. రెండో స్థానంలో ఉన్నవారికి కేవలం 21శాతం మాత్రమే ప్రజల ఆదరణ ఉన్నట్లు సర్వేలో తేలిందని చెప్పారు. ఈ నెల 30న లక్ష మందితో బాన్సువాడ పట్టణంలో మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభను విజయంతం చేయాలని కోరారు. నవంబర్ 4న బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాను నామినేషన్ వేయనున్నట్లు స్పీకర్ చెప్పారు. సన్నాహక సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ నియోజకవర్గంలోని తొమ్మది మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్, అక్టోబర్ 20 : బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్టకు చెందిన పండరిగౌడ్ మా ఓటు బీఆర్ఎస్ పార్టీకి, మా కుటుంబం మద్దతు పోచారం శ్రీనివాసరెడ్డికే.. ఇతర పార్టీల వారు దయచేసి ఓటు అడగడానికి మా ఇంటికి రాకండి అంటూ విన్నూత్న రీతిలో తన ఇంటి గోడకు ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఈ వార్త ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ప్రచురితం అయ్యింది. సోమేశ్వర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి తన ఫోనులో వార్త క్లిప్పింగ్ను స్పీకర్కు చూపించగా, తనపై అభిమానం చాటుకున్న పండరిగౌడ్ను వేదికపైకి పిలిచి ధన్యవాదాలు తెలుపుతూ అభినందించారు.