బాన్సువాడ రూరల్, సెప్టెంబర్ 19 : బాన్సువాడ నియోజకవర్గంలో గూడు లేని ప్రతి పేద కుటుంబానికి గూడు, సీఎం కేసీఆర్ సహకారంతో ప్రతి పేదింటి బిడ్డకూ కార్పొరేట్ స్థాయి విద్య, రైతుకు సాగు నీరు, ఇంటింటికీ తాగు నీటిని అందించడమే తన లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ – కోనాపూర్ గ్రామాల మధ్య రూ. 12 కోట్లతో నిర్మించే బాలికల గిరిజన గురుకుల పాఠశాల భవనానికి, నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో రూ.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వసతి గృహానికి రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు.
దుర్కి గ్రామంలో తాత్కాలికంగా నూతన ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఇంకా చేయాల్సింది ఉందని అన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా వచ్చే జూన్ నాటికి 14వేల ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతానని స్పీకర్ భరోసా ఇచ్చారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు. 2014కు ముందు రాష్ట్రంలో 230 గురుకులాలు ఉంటే ఇ ప్పుడు వాటి సంఖ్య 1008 చేరుకున్నదన్నారు. గు రుకులాల్లోని విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన కోసం సంవత్సరానికి రూ. 9000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. నియోజకవర్గానికి గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్కు కృతజ్ఞతలు తెలిపారు. గురుకుల పాఠశాల భవనాన్ని వచ్చే విద్యా సంవత్సరం లోపే పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అధికార దాహంతో సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసే ప్రయ త్నం చేస్తుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో హామీలను అమలు చేసి ఇక్కడ ప్రవేశ పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఉత్తుత్తి హామీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, మరో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని స్పీకర్ చెప్పారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పేరున కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ జేబులు నింపుకున్నారన్నారు. వీరి తీరును చూస్తుంటే దొం గలు, దొంగలు కలిసి ఊర్లు దోచుకున్న చందంగా తయారైందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ 75 ఏండ్ల స్వాతంత్య్ర భారత దేశంలో గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకున్న నాథుడే లేడని, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాక అధికారం లోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారని అన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల ఏర్పాటుకు శ్రీకా రం చుట్టారని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో నేడు రాష్ట్రంలో 7లక్షల మంది పేద విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదువుతున్నారని వివరించారు.
సామాన్యులకు విద్యను చేరువ చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్రంలో గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతులను పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా అనేక రైతు సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే పన్నాగం చేస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని తుపాకీ రాముడి వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఆడబిడ్డకు మేన మామగా, తండ్రిగా, అన్నగా చేయుతనందిస్తూ పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ. 10116 ఆర్థిక సహాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు ఆడబిడ్డల ఆశీర్వాదంతో మూడో సారి ముఖ్యమంత్రి కేసీఆరేనని పునరుద్ఘాంటించారు. బాన్సువాడ నియోజకవర్గానికి పోచారం శ్రీనివాస్రెడ్డి లాంటి నాయకుడు ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని ఆమె అన్నారు. పోచారం శ్రీనివాస్రెడ్డిని సీఎం కేసీఆర్ లక్ష్మీ పుత్రుడిగా అభివర్ణించారని, తనకు సైతం స్పీకర్ పోచారమే ఆదర్శం అని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గురుకుల పాఠశాల నిర్మాణానికి అవసరమైన ఐదు ఎకరాల భూమిని ఇచ్చిన రైతులను సన్మానించి వారికి కూడా మేలు చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం పోచారం భాస్కర్రెడ్డి సొంత ఖర్చుతో సమకూర్చిన ట్రై స్కూటర్ను వికలాంగుడికి మంత్రితో కలిసి స్పీకర్ అందచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.