బాన్సువాడ , జూన్ 3: రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు పంట పండిస్తేనే కడుపునిండా తిని బతుకుతామని, అలాంటి రైతును కాపాడుకోవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో శనివారం నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ సాగునీరు, ఉచిత కరెంటు, పంట పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో మద్దతు ధర అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు లేకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందజేశామని గుర్తు చేశారు. గతంలో 7వేల మెగావాట్ల కరెంటు ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 18వేల మెగావాట్లు ఉత్పత్తి చేసుకుంటున్నామని, భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టులు పూర్తికాగానే 28వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, పెట్టుబడిసాయం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో సాగునీటి ఇబ్బందులు తలెత్తవద్దనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని అన్నారు. నిజాంసాగర్కు సొరంగం పనులు త్వరలోనే పూర్తవుతాయని, ఆ తర్వాత రైతులకు మూడో పంటకూ నీరు విడుదల చేస్తామన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు డబ్బులు లేకపోవడంతో సీఎం కేసీఆర్ బ్యాంకు నుంచి అప్పు తెచ్చారని, రైతులను బతికించాలనే ఉద్దేశంతో పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకున్నారని కొనియాడారు. బాన్సువాడ మండలానికి రైతుబంధు ద్వారా రూ.90కోట్లు, రైతుబీమా కింద 298 రైతు కుటుంబాలకు రూ.14కోట్ల90లక్షలు అందజేశామని వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గ రైతుల నుంచి 18లక్షల21వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.3261కోట్లను చెల్లించినట్లు తెలిపారు.
తెలంగాణ పథకాలు గుజరాత్లో ఎందుకు లేవు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు దేశానికి ఆదర్శమని, ఇతర రాష్ర్టాల వారు తెలంగాణను ఆధ్యయనం చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణలో అందిస్తున్న పథకాలు, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు లేవో సమాధానం చెప్పాలన్నారు. గుజరాత్లో మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. నాలుగు రోజులైతే పగటి వేషగాళ్లు ఊర్లకు వచ్చి గాలి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారని, అలాంటి వారిని సూటిగా ప్రశ్నించాలని రైతులకు సూచించారు. గాలి మాటలు చెప్పే వారికి గట్టి సమాధానం ఇవ్వాలని అన్నారు. ప్రజలు ఆలోచించి.. మంచి పనిచేసే వారికి మద్దతుగా నిలువాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జగన్నాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నా పిల్లలు రోడ్డున పడేవారు
నా భర్త నీరడి సాయిలు ట్రాక్టర్ నడుపుతూ గుండెపోటుతో చనిపోయాడు. ఆ సమయంలో పూట గడవడమే కష్టంగా మారింది. కొన్ని రోజులు నేను, నా పిల్లలు పస్తులున్నాం. నా భర్త పేరిట రైతుబీమా కింద రూ.5 లక్షలు వచ్చాయి. దీంతో నా పిల్లల చదువులకు కొంత దాచిపెట్టి, మిగతా డబ్బులు బ్యాంకులో జమ చేసుకున్నాం. నా కుటుంబం రోడ్డున పడకుండా కాపాడిన సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం సార్లకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– నాగమణి, మహిళా రైతు, భైరాపూర్, బీర్కూర్ మండలం