సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో పండుగలా వ్యవసాయం
నియోజకవర్గంలో నిరుపేదలందరికీ గూడు కల్పిస్తాం
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
బాన్సువాడ టౌన్, జూన్ 19: సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతినిరుపేదకూ గూడు అందించడమే లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడ పట్టణం పరిధిలోని 2వ వార్డులో గౌడ కులస్తుల కోసం రూ.25 లక్షలతో చేపట్టనున్న ఫంక్షన్ హాలు నిర్మాణ పనులకు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని ప్రతి కులం వారి కోసం ప్రత్యేక ఫంక్షన్ హాళ్లు, సంఘ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే చాలా వరకు భవనాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఎక్కడైతే రైతు సంతోషంగా ఉంటాడో ఆ గ్రామం లో అందరికీ ఉపాధి దొరుకుతుందన్నారు.
తెలంగాణ రాకముందు రైతన్నలు వ్యవసాయం వదులుకొని ఉపాధికోసం పట్టణాలకు వలస వెళ్లేవారని అన్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రతి గుంటకూ నీటి వనరులు అందేలా ఏర్పాటు చేశారని తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు రైతులు, వ్యవసాయంతో నిండుదనం సంతరించుకున్నాయన్నా రు. బాన్సువాడ పరిధిలోని కొయ్యగుట్ట వద్ద సుమారు 14 ఎకరాల్లో 300 మడిగలు ఉండేలా ఆటోనగర్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ను అభినందించారు. ఈ ఆటోనగర్ ఏర్పాటైతే ఎం తో మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ, బుడ్మి విండో చైర్మన్లు కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, ఆత్మకమిటీ చైర్మన్ మోహన్ నాయక్, స్థానిక కౌన్సిలర్ మోతీలాల్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, నాయకులు నార్ల ఉదయ్, కనుకుంట్ల రాజు, పోతురెడ్డి, రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేక్ కట్ చేసిన స్పీకర్ పోచారం
బీర్కూర్, జూన్ 19: ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఆదివారం బాన్సువాడ పట్టణంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తన తండ్రి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి విషయంలో తనకు తన తండ్రే ఆదర్శమని ఈ సందర్భంగా భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. తమ కుటుంబానికే కాకుండా నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరినీ కుటుంబసభ్యుడిగా ఆయన చేరదీస్తారని అన్నారు.