బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 14: రోగి ప్రాణాన్ని కాపాడేందుకు డాక్టర్ ఎంత అవసరమో, నర్సు సేవలు కూడా అంతే తోడ్పడుతాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కారోనా వ్యాప్తి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన నర్సుల సేవలు అభినందనీయమని అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ల్యాంప్ లైటింగ్, క్యాపింగ్ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేవాభావంతో విధులు నిర్వహించేందుకు ఉపయోగపడే నర్సింగ్ కళాశాలను బాన్సువాడకు పట్టుబట్టి తీసుకువచ్చానన్నారు.
అడిగిన వెంటనే కళాశాల, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు పట్టణలోని మాతా శిశు దవాఖానను సభాపతి సందర్శించారు. దవాఖానలో అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ హన్సిలీ, వైస్ ప్రిన్సిపాల్ సత్యప్రియ, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.