నిజామాబాద్ సిటీ : ధరణీ పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశం మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణీతో ఎన్నో సమస్యలను పరిష్కరించడమే కాకుండా రైతులకు జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రయోజనాలు రైతులకు వర్తించాయని వెల్లడించారు. ఇందులో రెవెన్యూశాఖ అధికారులు కష్టపడి ఎన్నో సమస్యలను పరిష్కరించారని పేర్కొన్నారు.
ధరణీ పోర్టల్ ద్వారా జిల్లా స్థాయిలో 13,328 దరాఖాస్తులను పరిష్కరించామని వివరించారు. మరో 989 దరఖాస్తులు కోర్టు కేసులో పెండింగ్లో ఉన్నాయని, కొద్ది రోజుల్లోనే వీటిని కూడా అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు. 2016-17 సంవత్సరంలో సేకరించిన ఎల్ఆర్యూపీ వివరాల ఆధారంగా ధరణీలో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందని మ్యూటిషన్లు, రిజిస్ట్రేషన్లు వేగంగా, సాఫీగా జరుగుతున్నాయని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఆర్డీవో రవి, తాసీల్దార్లు, ధరణీ ఇన్చార్జి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.