బాన్సువాడ టౌన్, జూన్ 5: మున్సిపాలిటీగా ఏర్పడిన అతి తక్కువ కాలంలో బాన్సువాడ రాష్ట్ర స్థాయిలో గుర్తింపుపొందడం, అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో మొదటి పది స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16న పట్టణ ప్రగతి దినోత్సవం నేపథ్యంలో బాన్సువాడ మున్సిపల్ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మున్సిపల్ చైర్మన్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో సోమవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. బాన్సువాడ మున్సిపల్ అభివృద్ధికి, ఎల్లప్పడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తున్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిని అభినందించారు.
బాన్సువాడ పట్టణ పరిధిలో సుమారు 400 పై చిలుకు అభివృద్ధి పనుల కోసం రూ.400 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 85 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారు. పట్టణ పరిధిలోని 19 వార్డుల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా, ప్రజల సౌకర్యార్థం, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వినతిమేరకు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మనం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు చేరకపోతే ప్రజాప్రతిధులు, అధికారులు విఫలమైనట్లే అని పేర్కొన్నారు. ప్రతివార్డులో చేపట్టిన అభివృద్ధి పనులు, నిధులు, సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారుల వివరాలు ప్రజలకు అర్థయ్యేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఫ్లెక్సీలతోపాటు డాక్యుమెంటరీ రూపొందించి ప్రతి వార్డులో ప్రదర్శించాలన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టే కార్యక్రమాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా చూడాలని సూచించారు. సభలకు వచ్చే ప్రజలకు భోజనం ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న ఊరూరా చెరువుల పండుగను స్థానిక కల్కి చెరువుకట్ట పై నిర్వహించాలని సూచించారు. గంగపుత్రులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేపల వలలు, బుట్టలు, డబ్బాలు, థర్మాకోల్ బాక్సులు, వాహనాలతో డప్పుదరువులతో ర్యాలీగా తరలిరావాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ నెల 6న నిర్వహించాల్సిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని ఈ నెల 11న నిర్వహించనున్నట్లు తెలిపారు. నూతనంగా ఆటోనగర్ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ సమత, మున్సిపల్ కమిషనర్ కల్యాణం రమేశ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.