డిచ్పల్లి/ఇందల్వాయి, అక్టోబర్ 31: కాంగ్రెస్ నాయకులు చెప్పే మోసపూరిత మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్లో రూరల్ నియోజకవర్గ ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 88 గ్రామాల్లో ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టామని, రూ.3.69 కోట్లు నిధులు మంజూరు చేశామని తెలిపారు. ముదిరాజ్ కులస్తులను బీసీ -డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గంగపుత్రులు లేని గ్రామాల్లో మత్య్సకార సొసైటీల్లో ముదిరాజ్లకు సభ్యత్వం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి నివాళులర్పించి, రెండు ని మిషాల పాటు మౌనం పాటించారు. మాజీ ఎ మ్మెల్సీ, బీఆర్ఎస్ రూరల్ ఇన్చార్జి వీజీగౌడ్ మా ట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పాలకులు కులవృత్తులను నిర్లక్ష్యం చేయడంతో వారు వలసలు వెళ్లారని గుర్తుచేశారు. ముదిరాజ్ సం ఘం రాష్ట్ర నాయకుడు లల్లూ ముదిరాజ్ మాట్లాడుతూ.. రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
గుండారం మాజీ ఎంపీటీసీ సరిత తనకు వచ్చిన బీడీ పింఛన్ డబ్బులను రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు నామినేషన్ ఖర్చుల నిమిత్తం అందజేశారు. 5 నెలల పింఛన్ డబ్బులు రూ. 10 వేలను తన భర్త గుండారం ఎంపీటీసీ అంకం గంగాధర్తో కలిసి బాజిరెడ్డికి ఇచ్చారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.
కులవృత్తులను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లిలోని ఎస్ఎల్జీ గార్డెన్లో ఎంబీసీ కులాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్తో కలిసి పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో కుమ్మరి, రజక, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, మేదరి, మేరు, వడ్డెర కులస్తులకు కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకవచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల రత్నాకర్, ఇతర కుల సభ్యులు పాల్గొన్నారు.