ఖలీల్వాడి/కామారెడ్డి/శక్కర్నగర్, ఏప్రిల్ 24: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలోని డిపోలు, బస్టాండ్ల వద్ద ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చెర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ బలి కావాల్సి వచ్చిందని వాపోయారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని విలీనం చేసుకోవాలని, రెండు పీఆర్సీలు ఇవ్వాలని కోరారు.
న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని డిమాం డ్ చేస్తూ బోధన్లో నిరసన చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి బస్టాండ్ నుంచి డిపోకు వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి నివాళులు అర్పిస్తూ రెండు నిమాషాలు మౌనం పాటించారు. ఇలాంటి దురదృష్ట ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి మొండి వైఖ రి విడనాడి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
కామారెడ్డిలో ఆర్టీసీ సిబ్బంది శుక్రవారం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బస్టాండ్లోకి వెళ్లేందుకు కార్మికులు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి, వారిని నిలువరించారు. దీంతో ఎండలోనే బస్టాండ్ ఎదురుగా నిరసన చేపట్టారు. మానవహారం నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. శంకర్గౌడ్ది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు నిర్లక్ష్యం వల్లే ఒకరు బలి కావాల్సి వచ్చిందన్నారు.
తమ డిమాండ్లలో 28 అంశాలను పరిష్కరించామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. ఆయన సరైన అవగాహన లేదన్నారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు అడగడం లేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న వారు.. ఉద్యమాలు చేసే వారిపై బెదిరింపులకు పాల్పడడాన్ని ఏమంటారని ప్రశ్నించారు. యూనియన్ నాయకులు రమేశ్ గౌడ్, ఎస్కే మూర్తి తదితరులు పాల్గొన్నారు.