ఇందల్వాయి/డిచ్పల్లి, ఆగస్టు 23 : కార్యకర్తలే తన బలమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి టికెట్ దక్కించుకొని జిల్లాకు వచ్చిన సందర్భంగా బుధవారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ గన్నారం కమాన్, టోల్గేట్, బీబీపూర్ తండా, నాగ్పూర్ గేట్, డిచ్పల్లి, నడ్పల్లి, ధర్మారం మీదుగా జిల్లా కేంద్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉన్నదని, జీవితాంతం ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటానన్నారు. తనపై నమ్మకంతో మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా గతంకన్నా ఎక్కువ సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేసిన పార్టీకే ప్రజలు పట్టం కడతారని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెప్పే కల్లిబొల్లి మాటలు, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ 60 ఏండ్లు రాష్ర్టానికి ఏమీ చేయలేదని, తొమ్మిదేండ్లలోనే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రూరల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డిచ్పల్లికి తెలంగాణ యూనివర్సిటీ, డిగ్రీ కళాశాల, ధర్పల్లికి వంద పడకల దవాఖాన, సిరికొండకు ఐటీఐ తెచ్చామన్నారు. బోర్గాం నుంచి నడిపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ పనులను పూర్తిచేసినట్లు గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు త్వరలో దేశమంతటా విస్తరిస్తాయన్నారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ఈగ సంజీవ్రెడ్డి, ధర్పల్లి జడ్పీటీసీ జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఆయా మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.