ప్రజల మనసును గెలుచుకోలేమని తేలిపోవడంతో హస్తం నేతలు ప్రలోభాలకు తెరలేపారు. డబ్బుతో నాయకులు, ప్రజలను మభ్యపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రేవంత్రెడ్డి అనుచరుడి వద్ద లక్షలాది రూపాయల నగదు దొరకడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. పోటీకి దిగిన నాటి నుంచి రేవంత్రెడ్డికి గడ్డు పరిస్థితులు దాపురించడంతో దొడ్డిదారిని ఎంచుకున్నాడు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో హస్తం నేతల తీరుపై సామాన్య జనం సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి పట్టణంలో మంగళవారం గూడెం శ్రీనివాస్ రెడ్డి వద్ద లభ్యమైన మొత్తం డబ్బు అక్షరాల రూ. 56 లక్షల 84 వేలుగా ఎన్నికల అధికారులు, ఆదాయ పన్ను శాఖ లెక్క తేల్చారు. 500 నోట్లతో కూడిన 114 కట్టలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నవంబర్ 29న జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు కామారెడ్డి పోలీస్స్టేషన్లో గూడెం శ్రీనివాస్రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డబ్బు స్వాధీనం ప్రక్రియలో తనిఖీలు నిర్వహించిన వారిలో ఆదాయ పన్ను శాఖ అధికారి అభిషేక్ శుక్లా సైతం ఉన్నారు. లభ్యమైన మొత్తం డబ్బుకు సంబంధించిన వాటికి ఆధారాలను సమర్పించడంలో సదరు వ్యక్తి విఫలమయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను రియల్ఎస్టేట్ కంపెనీలో దాచడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించగా.. తలా తోక లేని సమాధానాలు ఇచ్చినట్లుగా తెలిసింది. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే డబ్బులు తీసుకువచ్చినట్లుగా అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఏ విధంగా కామారెడ్డికి చేరుకున్నాయనే కోణంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు వివరాలు రాబడుతున్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతును కోరాల్సిన కాంగ్రెస్ పార్టీ.. దొడ్డిదారిలో డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు.
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ఆ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ కంగుతిన్నారు. అప్పటివరకు తొడలు కొట్టిన కీలక నేతనే ఓటమిని అంగీకరించి పలాయనం చిత్తగించారు. పరువును నిలబెట్టుకునే క్రమంలో షబ్బీర్ స్థానంలో అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్న పీసీసీ చీఫ్.. ఇక్కడి నుంచి పోటీకి దిగారు. ప్రజల మద్దతు ఇసుమంతైనా లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు దాపురించడంతో కేసీఆర్ను ఎదుర్కొనేందుకు రేవంత్ దొడ్డిదారిని వెతుక్కున్నాడు. ఇందులో భాగంగానే కొడంగల్ బ్యాచ్ను రంగంలోకి దించి బీఆర్ఎస్ లీడర్లను కొనడానికి ప్రయత్నించారు. ఇలా కొంతమందిని ఎర వేసి, కండువా మార్చినప్పటికీ క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీ చెక్కు చెదరలేదు. గులాబీ సైనికులు మాత్రం కేసీఆర్ కోసం విశేషంగా కృషి చేయడంతో కేటీఆర్ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ సైతం సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత కాంగ్రెస్ నిర్వహించిన బీసీ డిక్లరేషన్, రేవంత్రెడ్డి రోడ్ షోలకు అంతగా స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు మింగుడు పడలేదు. దీంతో ఎలాగైనా ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టాలని కుట్రలకు దిగి, ఇష్టానుసారంగా వ్యవహరించడానికి హస్తం పార్టీ స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే డబ్బు సంచులను డంప్ చేసి ప్రలోభాల పర్వానికి తెరలేపింది.
కామారెడ్డి నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వర్గీయులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకే తిలోదాకలిస్తూ ఈసీ వ్యవస్థకే సవాల్ విసురుతున్నారు. నాన్ లోకల్ వ్యక్తులు ప్రచారం ముగిసిన తర్వాత కామారెడ్డిలో ఉండకూడదని రూల్ ఉన్నప్పటికీ లెక్క చేయకుండా కామారెడ్డిలోనే రేవంత్ మనుషులు తిష్ట వేసుకొని ఉన్నారు. దొడ్డి దారుల్లో గుర్తింపు కార్డులను దక్కించుకున్న వ్యక్తులు.. తలోదారిలో తల దాచుకుని ప్రజలను డబ్బుతో కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్పై పోటీకి దిగిన రేవంత్రెడ్డి ప్రజల మనసులను కొల్లగొట్టి గెలవాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా ఓటర్లను డబ్బులతో కొనుగోలు చేస్తూ వికృత చేష్టలకు తెరలేపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రేవంత్రెడ్డి అనుచరుడిగా పేరొందిన గూడెం శ్రీనివాస్రెడ్డి వద్ద నోట్ల కట్టలు బయటపడ్డాయి. కామారెడ్డి పట్టణంలోని జీవదాన్ స్కూల్ వద్ద ఉన్న రియల్ఎస్టేట్ ఆఫీసు అడ్డాగా చేసుకొని, ఈ అక్రమ తంతును నడుపుతుండగా పలువురు గుర్తించారు. వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా దాడులు నిర్వహించారు. ఇందులో నోట్ల కట్టలు బయట పడడంతో అవాక్కైన ఎన్నికల అధికారులు.. వెంటనే ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. లెక్కా పత్రాలను తేల్చిన తర్వాత ఈ మొత్తం అక్రమంగానే తీసుకువచ్చిన సొమ్ము కింద భావించి బుధవారం కేసు నమోదు చేయడంతో వీరి వ్యవహారం తేటతెల్లమైంది.