రెంజల్, ఏప్రిల్ 30: రైతుల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ సర్కారు దెబ్బకు దిగొచ్చింది. రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించింది. రెంజల్ మండల కేంద్రం నుంచి బ్రాహ్మణపల్లి (బందళ్ల) , దూపల్లి ఎక్స్ రోడ్ వరకు రహదారి నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించింది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పనులు నిలిచిపోయాయి. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం రెంజల్ మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే నిలిపి వేసిందని, త్వరగా పూర్తి చేయకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రెంజల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డి స్పందించారు. నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మికుల రుణం తీర్చుకుంటామని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు.