గ్రామానికి ఆయువుపట్టు చెరువు. పంటల సాగుతోపాటు స్వయం ఉపాధిపై ఆధారపడిన వారెందరికో కల్పతరువు. సమ్మిళిత జీవన విధానానికి కేంద్ర బిందువైన పల్లెలకు అత్యంత కీలకమైనవి చెరువులే. అయితే, సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో చిన్ననీటి వనరులు ధ్వంసమయ్యాయి. పిచ్చిమొక్కలతో నిండి, పూడికతో కూరుకుపోయి ఆనవాళ్లు కోల్పోయాయి. పల్లెకు ప్రాణాధారమైన చెరువులకు మిషన్ కాకతీయ పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారు. దీంతో నెర్రెలు బారిన చెరువులన్నీ జల కళ సంతరించుకున్నాయి. ఎండాకాలంలోనూ నిండుగా కనిపిస్తున్నాయి. పుష్కలంగా సాగునీరు అందించి అన్నదాతలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. చెరువులపై ఆధారపడిన గంగపుత్రులకూ చేయూతనిస్తున్నది. దళారీ వ్యవస్థను అరికట్టడంతో పాటు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో మత్స్య సంపద దండిగా పెరిగింది. జాలర్లకు చేతినిండా పని దొరికింది. చేపల పంట పండుతుండడంతో గంగపుత్రుల జీవితాలకు ఢోకా లేకుండా పోయింది. మిషన్ కాకతీయ వల్ల కలిగిన ప్రయోజనాలు ఇప్పుడు కండ్ల ముందు కనిపిస్తున్నాయి.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 22
చెరువు నిండింది.. చేపల పంట పండింది..
గాంధారి, ఫిబ్రవరి 22: చెరువులతో కలిగే బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన మిషన్ కాకతీయ పనులతో గాంధారి మండల కేంద్రంలో మొకురం చెరువు వేసవిలో సైతం నీటితో కళకళలాడుతున్నది. మిషన్ కాకతీయ రెండో విడుత పనుల్లో భాగంగా రూ.59.74 లక్షలతో మొకురం చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంట్లో భాగంగా వందల ఏండ్ల నుంచి చెరువులో పేరుకుపోయిన నల్లమట్టిని తొలగించడంతోపాటు. నాసిరకంగా ఉన్న చెరువు కట్టను బలోపేతం చేసి నూతనంగా తూములు, మత్తడిని నిర్మించారు. దీంతో చెరువులో నీరు నిలువ సామర్థ్యం పెరగడంతోపాటు, చెరువులోని నీరు వృథాగా పోకుండా అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం వేసవిలో సైతం మొకురం చెరువు నిండుకుండలా దర్శనమిస్తున్నది.
మత్స్యకారులకు ఉపాధి..
ఒకప్పుడు వానకాలంలో మాత్రమే చెరువుల్లో నీరు ఉండే ది. అలాంటిది మిషన్ కాతీయ పనులతో వేసవిలో సైతం చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. దీంతో చేపలు పెరగడానికి చెరువులు అనుకూలంగా మారాయి. మండల కేంద్రంలోని మొకురం చెరువులో ఆరేండ్లుగా వేసవిలో సైతం నీరు ఉంటుండడంతో చేపలు పెద్ద సైజులో పెరుగుతున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా బలోపేతం కోసం ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేపపిల్లలను అందించడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ సంవత్సరం సైతం రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీపై 1.35 లక్షల చేపపిల్లలను చెరువులో వదిలారు.
ఏటా రూ.10లక్షల ఆదాయం..
డిచ్పల్లి, ఫిబ్రవరి 22:మండలంలోని మిట్టపల్లి పెద్ద చెరువుకు మిషన్ కాకతీయ ద్వారా రూ.55లక్షలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పూడికతీత, కట్ట బలోపేతం, అలుగు మరమ్మతులను చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలకళను సంతరించుకున్నది. కులవృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేలా సీఎం కేసీఆర్ సర్కారు మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించేందుకు వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేసింది. 117 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మిట్టపల్లి చెరువుకు ఏటా లక్షా 10వేల నాణ్యమైన చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. గ్రామంలో 51 మత్స్యకార కుటుంబాలు చెరువుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఏటా లక్షా 50వేల విలువ చేసే చేపపిల్లలను చెరువులో వదలడంతో చేపలు పెద్దవయ్యాక సుమారు 5 నుంచి 10లక్షల వరకు ఆదాయాన్ని గడిస్తున్నారు. తెలంగాణ రాకముందు మత్స్యకారులే చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదిలేవారు. అవి నాణ్యమైనవి కాకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు సైతం ఉన్నాయి. స్వరాష్ట్రంలో రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతో మత్స్యకారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ కాకతీయ చెరువులు.. మత్స్యసిరులు
కోటగిరి, ఫిబ్రవరి 22: నాడు నెర్రలు బారిన చెరువులు.. ఎండిపోయిన బావులు.. పిచ్చి మొక్కలతో కాల్వలు.. రైతులకు కన్నీరు.. చేపల పెంపకానికి అవకాశం లేక మత్స్యకారులు ఉపాధి కోల్పోయి పస్తులున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల కారణంగా తెలంగాణలో కులవృత్తులు దెబ్బతిని బతుకుభారంగా మారింది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో 2015లో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువుల ఆధునీకరణతో నీటి సామర్థ్యం విపరీతంగా పెరిగింది. కోటగిరి, పొతంగల్ మండలాల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు, వర్షాల ఆధారంగా నీటిని నిల్వ చేసుకోవడంతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. పంట పొలాలు సస్యశ్యామలం కావడంతోపాటు మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి. చేపల పెంపకంతో చేతినిండా ఉపాధి దొరుకుతున్నది. చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ వందశాతం రాయితీతో చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. దీంట్లో భాగంగా ఈ ఏడాది పొతంగల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో 26వేల చేప పిల్లలను వదిలారు. ఐదేండ్ల నుంచి మత్స్యకారులు చేపల వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు.
ఎనిమిదేండ్లలో రూ.16లక్షలు
రాజంపేట్, ఫిబ్రవరి 22: రాజంపేట మండల కేంద్రంలో ఊర చెరువు, దేవుని చెరువులు ఉండగా మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో చెరువులో నీటి సామర్థ్యం పెరిగి మత్స్యకారులకు వరంగా మారింది. చెరువుల మీద ఆధారపడి దాదాపు 180 మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గతంలో చెరువుల్లో నీటి నిల్వ లేకపోవడంతో చేపల పెంపకానికి ప్రతికూలంగా మారి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయి బతుకుదెరువు కోసం పట్టణాలకు వెళ్లారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ కాకతీయ పథకం మత్స్యకారులకు వరంలా మారింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు చెరువుల్లో కలిపి 40వేల చేపపిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నది. ఒక సంవత్సరానికి సుమారు రెండు టన్నుల చేపల దిగుబడి వస్తుంది. వీటిని విక్రయించడంతో కిలోకు సుమారు రూ.100 చొప్పున రెండు టన్నుల చేపలకు రెండు లక్షల ఆదాయం సమకూరుతుంది. ఎనిమిదేండ్లలో సుమారు రూ.16లక్షల ఆదాయం లభించినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. డిమాండ్ మేరకు చేపలను ఎగుమతి చేసుకునేందుకు వీలుగా 8మంది మత్స్యకారులకు టీవీఎస్ వాహనాలు, ఒకరికి టాటాఏస్ వాహనాన్ని ప్రభుత్వం అందించింది.
చెరువులు నిండుగా.. చేపలు దండిగా..
ఇందల్వాయి, ఫిబ్రవరి 22: ఐదు సంవత్సరాల నుంచి సమృద్ధిగా వర్షాలు కురవడంతో చెరువులు నిండుకుండలా దర్శనమిస్తూ జలకళను సంతరించుకున్నాయి. దీంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటైంది. గత ప్రభుత్వాలు మత్స్యసంపదను ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేస్తుండడంతో మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారు. దీంతో రూపాయి ఖర్చు లేకుండానే చెరువుల్లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి పెద్ద చెరువు సుమారు 360ఎకరాలపైన విస్తీర్ణం కలిగి ఉన్నది. ఈ చెరువును మిషన్ కాకతీయలో పూడికతీయడంతోపాటు కట్ట ఎత్తు పెంచడం, అలుగు, తూముల మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ.కోటీ10లక్షలు మంజూరు చేసింది. ఏటా 2లక్షల 10వేల చేపపిల్లలను చెరువులో వదులుతున్నది. వాటి విలువ సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఉంటుంది. ప్రతి సంవత్సరం చేపల విక్రయం ద్వారా సుమారు 15 నుంచి 20లక్షల రూపాయలు మత్స్యకారులకు ఆదాయం సమకూరుతున్నది. గ్రామంలోని 150 కుటుంబాలు చెరువుపై ఆధారపడి చేపల వృత్తిని కొనసాగిస్తున్నారు
మత్స్యకారులకు పెద్దపీట
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేశారు. మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను అందజేశారు. గతపాలకులు మత్స్యకారులను పట్టించుకున్న దాఖలాలు లేవు. మిషన్ కాకతీయతో చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టడంతో చేపలు సైతం బాగా పెరిగాయి. ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-అల్లుల్ల బాల గంగాధర్, మత్స్యకారుడు మిట్టపల్లి
ఆదాయం పెరిగింది..
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వంద శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. రాయితీపై వాహనాలను అందించారు. మత్స్యకారులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చారు. చేపల పెంపకంతో మాకు ఉపాధి పెరిగింది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– చిన్న భూమయ్య, మత్స్యకారుల సంఘం మాజీ అధ్యక్షుడు,పొతంగల్
చేపలతో ఉపాధి లభిస్తుంది..
మిషన్ కాకతీయ పుణ్యమా అని ఆరు సంవత్సరాలుగా మొకురం చెరువులో నీరు పుష్కలంగా ఉంటుంది. దీంతో చేపలు బాగా పెరిగి బరువు తూగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వంద శాతం రాయితీపై చేపపిల్లలను చెరువులో వదలడంతో మా కులస్తులకు ఉపాధితోపాటు అధిక లాభాలు వస్తున్నాయి. చెరువులో పట్టిన చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం.
– బెస్త నారాయణ, మత్స్యకారుడు, గాంధారి
మస్త్గా చేపలు..
నస్రుల్లాబాద్, ఫిబ్రవరి 22:మండలంలోని మిర్జాపూర్ గ్రామ చెరువులో 3లక్షల చేప పిల్లలను వదిలారు. రెండేండ్ల తర్వాత సుమారు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయం వస్తుంది. గ్రామ చెరువు విస్తీర్ణం 202 ఎకరాలు ఉండగా 40 మత్స్యకార్మిక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. చెరువు నిండుగా ఉండడంతో చేపలు సమృద్ధిగా పెరుగుతున్నాయి.
-దొబ్బల గంగాధర్,గ్రామ మత్య్స సహకార సంఘం అధ్యక్షుడు,మిర్జాపూర్
మిషన్ కాకతీయతో సాధ్యపడింది..
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువును బాగు చేసింది. దీంతో చేపల ఉత్పత్తికి సాధ్యమయ్యింది. గతంలో చెరువులను పట్టించుకున్న నాథుడే లేడు. చెరువులు బాగుపడడంతోపాటు చేపల ఉత్పత్తి పెరిగి మాకు లాభదాయకంగా మారింది. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితంగానే చెరువులన్నీ చేపలతో కళకళలాడుతున్నాయి.
– కొరట్పల్లి ఆనంద్, మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు, ఇందల్వాయి
కేసీఆర్కు రుణపడి ఉంటాం..
మత్స్యకారుల బాగోగులను పట్టించుకున్న ఏకైక సీఎం కేసీఆర్. ఆయన మత్స్యకారుల ఆత్మబంధువుగా నిలిచి అనేక రాయితీలు అమలు చేస్తున్నారు. ఉచితంగా చేపపిల్లలు అందజేస్తూ మాకు ఉపాధి చూపుతున్న సీఎం కు మత్స్యకారులంతా రుణపడి ఉంటాం.
– గూండ్ల భూమయ్య, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు, పొతంగల్
మత్స్యకారులకు భరోసానిచ్చిన పథకం..
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం పనులు సత్ఫలితాలనిచ్చాయి. మా గ్రామ సమీపంలోని మొకురం చెరువులో నీటి నిలువ సామర్థ్యం పెరిగింది. ఆరేండ్లు గా చేపలు పెద్ద సైజులో పెరుగుతున్నాయి. దీంతో మత్స్యకారుల జీవనోపాధికి భరోసా ఏర్పడింది. అండగా ఉంటున్న కేసీఆర్ సర్కారుకు ధన్యవాదాలు.
– మమ్మాయి సంజీవ్, సర్పంచ్, గాంధారి