వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సత్తా చాటేందుకు బలమైన వ్యూహాలను రచిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గెలుపే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో జరుగుతున్న సమీక్షల్లో లోతుగా చర్చ జరుగుతున్నది. కిందిస్థాయి నేతలందరితోనూ లోటుపాట్లపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు పకడ్బందీ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 2014లో 11, 2019లో 7 స్థానాల్లో బీఆర్ఎస్ విజయదుందుబి మోగించింది. అదే స్ఫూర్తితో ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేలా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
లోక్సభ ఎన్నికలు 2014లో నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి కల్వకుంట్ల కవిత గెలుపొందారు. అనంతరం 2019లో కాంగ్రెస్, బీజేపీల అనైతిక రాజకీయ ఒప్పందాలతో బీఆర్ఎస్ ఓటమి చెందింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేరుగా బీజేపీతో ములాఖత్ కావడమే ఇందుకు నిదర్శనం. జాతీయ పార్టీలైనప్పటికీ లోక్సభ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లో పరస్పర సహకారం ధోరణితో అవలంభిస్తూ ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయి. బయటికి కొట్లాడుకున్నట్లుగానే కనిపిస్తున్నప్పటికీ అవసరం ఉన్న చోట పరస్పరం సహకారం చేసుకోవడం కాంగ్రెస్, బీజేపీలకు అలవాటే అన్నది నిజామాబాద్ లోక్సభ ఎన్నికలే స్పష్టం చేశాయి. ఈసారి జరుగబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల ద్వంద నీతిని ప్రజలంతా గమనించిన దరిమిలా బీఆర్ఎస్ వైపే జనాలంతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అధికారం చేజారినప్పటికీ ప్రజలంతా ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పట్టం కట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మిగిలిన నాలుగు చోట్ల 2 కాంగ్రెస్, 2 బీజేపీ గెలిచింది. బలాబలాల రూపంలోనూ ఇక్కడ బీఆర్ఎస్కే అత్యధికంగా ఓటు షేరింగ్ ఉన్నందున ప్రజల తీర్పు మాత్రం గులాబీ పార్టీకే అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పసుపు బోర్డు విషయంలో పూటకో నాటకం ఆడుతూ రైతులను బీజేపీ మభ్యపెట్టడం మూలంగా వారంతా కమలం పార్టీపై ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఐక్యంగా ఈ ఎన్నికల్లో కదం తొక్కి నిజామాబాద్ లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని సమీక్షలో పలువురు వెలిబుచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినంత మాత్రాన భారత రాష్ట్ర సమితి చిన్నదై పోదన్న అభిప్రాయం సమావేశంలో సర్వత్రా వ్యక్తమైంది. ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పార్టీ కొద్దిరోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు కొండంత అండగా నిలవడం ఖాయం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి విజయాన్ని కట్టబెట్టాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ చేయాల్సిందల్లా కార్యకర్తలకు తామున్నామనే భరోసా ఇవ్వడం. అదే భరోసాను కల్పిస్తూ లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలను అధిష్టానం నిర్వహిస్తున్నది. పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటూ, సంస్థాగతంగా మరిం త బలోపేతమవుతూ కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అజేయశక్తిగా నిలబెట్టేందుకు ప్రతి గులాబీ సైనికుడు పాటుపడేలా ముఖ్య నేతలంతా దిశానిర్ధేశనం చేస్తున్నారు. 2001లో పార్టీ పుట్టిన్నాడు కేసీఆర్ ఒక్కడై బయల్దేరి, రాదనుకున్న తెలంగాణను సాధించి చూపించారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డారు. ఇప్పుడీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో కుంగిపోవడం అంటూ ఉండదన్న సంకేతాలను శ్రేణులకు బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం స్పష్టంచేసింది. ఆశించిన ఫలితాలు రానందునా ఎవ్వరూ కుంగిపోకూడదని హితబోధ చేశారు.
లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని, గట్టిగా పోరాడితే ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీఆర్ఎస్ భవన్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంపై సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు. ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల సంజయ్, ఎంపీ సురేశ్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, జీవన్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, అయేషా ఫాతిమా, రాంకిషన్రావు, రాజేశ్వర్రావు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను పక్కదారి పట్టించిందన్నారు. అప్పులు, శ్వేత పత్రాలు అంటూ అభయహస్తం హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.