ఖలీల్వాడి, నవంబర్ 23 : అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో పోడుభూముల సాగును అడ్డుకునే క్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యకు గురైన సంఘటనను కలెక్టర్ ఉటంకిస్తూ..
ఈ తరహా ఉదంతాలకు తావు లేకుండా ముందస్తుగానే పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా అటవీ సంబంధిత అంశాలపై మౌఖికంగా లేదా రాతపూర్వకంగా ఫిర్యాదు అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. అటవీ భూముల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని తెలిపారు.
ఎక్కడా అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా పక్కాగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ భూముల పరిరక్షణ విషయంలో రాజీ పడకూడదని, ఈ విషయంలో జోక్యం చేసుకునే వారు ఎంతటివారైనా పీడీ యాక్ట్ను నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. పోడుభూముల అంశం సున్నితమైనందున ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ అర్హులైన వారికి పోడు పట్టాలు అందించి హద్దులు చూపించే వరకు ఎవరు కూడా అటవీ భూములను ఆధీనంలోకి తీసుకోకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అటవీ అధికారులు, సిబ్బందికి జిల్లా యంత్రాంగం పూర్తి భద్రత కల్పిస్తుందని భరోసా కల్పించారు. ఈ దిశగా పోలీసు అధికారులు కృషిచేయాలని సూచించారు. సెల్ కాన్ఫరెన్స్లో పోలీసు కమిషనర్ కేఆర్.నాగరాజు, డీఎఫ్వో వికాస్ మీనా, ఆర్డీవోలు, ఎఫ్డీవోలు, రేంజ్ అధికారులు పాల్గొన్నారు.