తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చెరువుల పండుగ అట్టహాసంగా సాగింది. బతుకమ్మలు, వలగొడుగులు, డప్పు దరువులతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. బోనాలతో మహిళలు చెరువు కట్టలపైకి చేరుకున్నారు. కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమయ్యారు. వారితో సహపంక్తి భోజనాలు చేశారు. స్థానికులతో ఆడిపాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఎడపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. సమైక్య పాలనలో చెరువుల దుస్థితి.. నేడు పూర్వవైభవం సంతరించుకున్న పరిస్థితులపై వివరించారు. బాన్సువాడ మండలం తాడ్కోల్, పట్టణంలోని కల్కి చెరువువద్ద స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, భీమ్గల్ మండలం పురాణీపేట్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువుల పండుగను గురువారం వైభవంగా నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ ఆడారు. కట్టమైసమ్మకు పూజలు చేసి యాటలను బలిచ్చారు. అనంతరం ఊరంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. చెరువుల పండుగలో వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో సమావేశమై తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన అభివృద్ధిని వివరించారు. చెరువులకు వచ్చిన పూర్వ వైభవాన్ని ప్రత్యక్షంగా చూపించారు. సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలతో చెరువుల పునరుద్ధరణ చేపట్టడంతో ప్రజల జీవితాలు ఎలా మెరుగుపడ్డాయో వివరించారు.
నిజామాబాద్ రూరల్, జూన్ 8: ఉమ్మడి పాలనలో ఆదరణ కోల్పోయి కళాహీనంగా మారిన చెరువుల పునరుద్ధరణను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం ఎంతగానో దోహదపడిందని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం రాత్రి నగర శివారులోని కాలూర్ ఊరచెరువు మినీ ట్యాంక్బండ్ వద్ద నిర్వహించిన చెరువు పండగ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చెరువుల్లో పేరుకుపోయిన మట్టి పూడికతీసి చెరువు కట్ట ఎత్తు పెంచి బలోపేతం చేయడంతోపాటు తూములు నిర్మించడంతో నీరు ఎక్కువగా నిల్వ ఉన్నదన్నారు. రూరల్ మండలంలో రూ.10కోట్లతో చెరువులన్నింటినీ పునరుద్ధరించామన్నారు. వందల కోట్ల రూపాయలతో చెక్డ్యామ్లను నిర్మించడంతో నీరు నిల్వతోపాటు భూగర్భ జలమట్టం పెరిగిందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాల బీడు భూములకు సాగునీరందించాలనే ముఖ్య ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మోపాల్ మండలంలోని మంచిప్ప వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణంతోపాటు పైపులైన్ సహాయంతో సాగునీరందించే పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. రైతాంగ శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు లిఫ్ట్ ఇరిగేషన్లు నిర్మించి సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుకర్రావు, నుడా డైరెక్టర్ ముస్కె సంతోష్, కార్పొరేటర్లు కోర్వ లలితాగంగాధర్, శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బొల్లెంక గోపాల్రెడ్డి, అంకల గంగాధర్, అశోక్, కోర్వ శ్రీనివాస్, అన్నం సాయిలు, మోహన్, జితేందర్, శ్రీధర్, ప్రవీణ్ పాల్గొన్నారు.
ఖలీల్వాడి, జూన్ 8: సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారిందని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లి ఊర చెరువు వద్ద గురువారం నిర్వహించిన చెరువుల పండుగలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల్లో నీరుంటేనే ఊరు పచ్చగా ఉంటుందన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలోని 47,000 చెరువుల్లో పూడికతీసి పునరుద్ధరించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి వెన్నెముకగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రం వచ్చిన తర్వాతే వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మత్స్య సంపద గణనీయంగా పెరిగి 4లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నదని వెల్లడించారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, కార్పొరేటర్ ముచ్కూర్ లావణ్యానవీన్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సిర్పరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్, జూన్ 8: చెరువులు, కుంటలు, వాగుల్లో కనిపిస్తున్న జలకళకు కర్త, కర్మ, క్రియ సీఎం కేసీఆరేనని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ మది నుంచి జన్మించిన మిషన్ కాకతీయతో పునరుద్ధరణ జరిగిన చెరువుల్లో ప్ర స్తుతం కనిపిస్తున్న జలదృశ్యం తో పల్లెల్లో బాధలన్నీ తొలగి ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉ త్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమా ల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలూర్ మం డలం కిష్టం చెరువు, ఆర్మూర్ మండలం పిప్రి, గోవింద్పేట్, నందిపేట మండలం వెల్మల్ గ్రామ చెరువుల వద్ద నిర్వహించిన వేడుకలో పాల్గొని కట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సాగు, తాగునీటి చరిత్రను కేసీఆర్ పాలనకు ముందు, కేసీఆర్ పాలన తర్వాత బేరీజు వేసుకోవాలన్నారు. నాడు సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఎండిన చెరువులు, నేడు కేసీఆర్ శ్రమతో నిండుకుండలా మారాయన్నారు. నాడు జీవన విధ్వంసం జరిగితే, నేడు జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల ఆయకట్టు పెరిగిందని, చెరువుల్లో చేపల పెంపకంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. మిషన్ కాకతీయతో ఆర్మూర్ నియోజకవర్గంలో 220 చెరువుల పునరుద్ధరణ జరిగిందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రజలతో కలిసి బోనాలు ఎత్తుకున్నారు. మత్స్యకారులతో కలిసి వలను చేతపట్టుకొని చెరువు వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఆలూర్ సర్పంచ్ కళ్లెం మోహన్రెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు
బీబీపేట్, జూన్ 8: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్ అన్నారు. బీబీపేట పెద్ద చెరువు వద్ద గురువారం ఏర్పాటు చేసిన చెరువుల పండుగలో ఆయన పాల్గొని మాట్లాడారు. పల్లె జీవనానికి ఆధారమైన చెరువులు, కుంటలను ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోకపోవడంతో ధ్వంసమయ్యాయని గుర్తుచేశారు. చెరువులపై ఆధారపడి బతికిన ఎంతో మంది వ్యవసాయాన్నీ వదులుకున్న పరిస్థితులు వచ్చాయన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువులు, కుంటల్లో పూడికతీత చేపట్టడంతో పూర్వ వైభవం వచ్చిందన్నారు. చెరువులన్నీ నిండుగా ఉండడంతో ప్రజలంతా హాయిగా జీవిస్తున్నారన్నారు. అనంతరం బీబీపేట మండల అభివృద్ధికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కస్తూర్బా పాఠశాలలో అదనపు గదుల కోసం భూమిపూజ చేశారు. పెద్ద చెరువు కట్ట విస్తరణ చేపడతామని, మైసమ్మ గుడిని పునర్నిర్మిస్తామని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ట్రైనీ కలెక్టర్ శివేంద్రప్రతాప్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలమణి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద, జూన్ 8: సీఎం కేసీఆర్ ప్రారంభించిన మిషన్ కాకతీయ అనే ఒక్క పథకం అనేక ఫలితాలను ఇచ్చిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండలం బండరెంజల్ గ్రామంలో గురువారం నిర్వహించిన చెరువుల పండుగలో ఆయన పాల్గొని మాట్లాడారు. చెరువులను పునరుద్ధరించడంతో గంగపుత్రులు చేపలు విక్రయించుకొని ఉపాధి పొందుతున్నారని, వారికి చెరువులు కన్నతల్లిలా సాయం అందిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేయడంతో గంగపుత్రులకు ఉపాధి లభించిందని గుర్తుచేశారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, చేపలు విక్రయించుకునేందుకు ద్విచక్రవాహనాలు, టాటాఏస్ వాహనాలను ఉచితంగా అందజేసినట్లు గుర్తు చేశారు. చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారని వివరించారు. కాంగ్రెస్ హయాంలో చెరువుల అభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదని ఎమ్మెల్యే హన్మంత్షిండే విమర్శించారు. అనంతరం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ చెరువులతో రైతులు, గంగపుత్ర కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో బోయి కులస్తులు అభివృద్ధి చెందారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు, పుల్కల్ సొసైటీ చైర్మన్ రాంరెడ్డి , రైతులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, జూన్ 8: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు పునరుద్ధరణకు నోచుకున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గ్రామాల్లోని చెరువు నిండితే ఊరంతా పండుగలాగే ఉంటుందని వివరించారు. లింగారెడ్డిపేట ఊర చెరువు వద్ద గురువారం నిర్వహించిన చెరువుల పండుగకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జాజాల హాజరయ్యారు. ఈ సందర్భంగా చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ మెట్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు చెరువుకు బుంగలు పడేవని, రైతులు సాగునీటి కోసం ఇబ్బందిపడేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో జలకళను సంత రించుకున్నాయన్నారు. ఎండాకాలంలోనూ చెరువులన్నీ నీటితో నిండుగా ఉన్నాయన్నారు. చెరువుల ఆయకట్టుకు రెండు పంటలకూ సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యం, కౌన్సిలర్ భూంగారి రాము, నీటి పారుదల శాఖ డీఈఈ వెంకటేశ్వర్లు , రైతులు పాల్గొన్నారు.