శరవేగంగా కామారెడ్డి అభివృద్ధి
కార్యరూపం దాల్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీలు
మెరుగు పడిన మౌలిక వసతులు
మూడేండ్లలో రూ.150 కోట్లకు పైగా వెచ్చించిన ప్రభుత్వం
కొత్తరూపు సంతరించుకున్న పట్టణం
కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి బాట పడుతున్నది. పట్టణంలోని అన్ని ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 49 వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతోంది. అందుకోసం అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం తదితర పనులు చేపడుతూ అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నది.
కామారెడ్డి మున్సిపల్ భవనం
పచ్చదనంతో కళకళలాడుతున్న కామారెడ్డి పట్టణంలోని రహదారి
కామారెడ్డి, జూలై 5:
కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బల్దియాల అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణప్రగతితో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు అమలు కావడంతో పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. 49వార్డులతో కొనసాగుతున్న మున్సిపాలిటీలో రూ.150కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధ్దన్ స్వయంగా వార్డుల్లో పర్యటించడం, ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుండడంతో పట్టణం సుందరంగా తయారవుతున్నది. వార్డుల్లో పోటాపోటీగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్ల పనులు కొనసాగుతుండగా, మరోవైపు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులను నిర్వహిస్తూ డివైడర్లలో పూల మొక్కలను నాటడంతో పట్టణమంతా పచ్చదనంతో కళకళలాడుతున్నది.
గ్రామాల విలీనంతో.. నిధుల వరద
కామారెడ్డి మున్సిపాలిటీ 1987లో ఏర్పాటైంది. 33వార్డులతో సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా మొదట ఏర్పడగా ప్రస్తుతం 49 వార్డులతో విస్తరించింది. మున్సిపాలిటీలో అడ్లూర్, టేక్రియాల్, లింగాపూర్, దేవునిపల్లి, సరంపల్లి, చిన్నమల్లారెడ్డి గ్రామాలను విలీనం చేశారు. 2011జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 80,378 జనాభా ఉన్నది. పట్టణ సమీపంలోని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో గ్రేడ్-1 మున్సిపల్గా ఏర్పడింది. దీంతో నిధుల వరద మొదలైంది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గసభ్యులు, అధికారుల పర్యవేక్షణలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేశారు. కోట్లాది రూపాయల నిధులతో పనులను చేపడుతుండడంతో పట్టణం కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రధాన రహదారులను బీటీ రోడ్లుగా, వార్డులు, కాలనీల్లోని రోడ్లను సీసీ రోడ్లుగా, ఇంటర్నల్ రోడ్ల అభివృద్ధితోపాటు మురికి కాలువల నిర్మాణం చేపట్టారు. తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ పథకంలో భాగంగా నీటిని సరఫరా చేస్తున్నారు.
దేవునిపల్లిలో నిర్మించిన వైకుంఠధామం
మూడేండ్లలో రూ.150కోట్ల పనులు..
కామారెడ్డి పట్టణంలో మూడేండ్లలో రూ.150కోట్ల మేరకు అభివృద్ధి పనులను చేపట్టారు. ఏ వార్డులో చూసినా ఏదో ఒక అభివృద్ధి పనులు కొనసాగుతుంటాయి. గాంధీ గంజ్లో రూ.7కోట్ల20 లక్షలతో సమీకృత మార్కెట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. టుపిడ్కో ఫేజ్1, 2కింద రూ.45కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీ పనులతోపాటు కళాభారతి ఆడిటోరియం, పార్కులను నిర్మించారు. టుపిడ్కో జీవోనం.65 కింద రూ.6కోట్ల 45లక్షలతో వైకుంఠధామాలు, వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టారు. మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా రూ.18.46కోట్లతో మూడేండ్ల వ్యవధిలో వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.17.16కోట్లు, 15వ ఫైనాన్స్ కింద రూ.8.75కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టులు, ప్రహరీలు, డంపింగ్యార్డ్, పైప్లైన్ పనులు చేపట్టారు. ఎస్ఎఫ్సీ ద్వారా 2.42కోట్లు, ఎల్ఆర్ఎస్తో రూ.2కోట్ల పనులు నిర్వహించారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీతో మేరకు రూ.20.30కోట్లతో వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. టేక్రియాల్ నుంచి నర్సన్నపల్లి రోడ్డు విస్తరణ పనులను రూ.23కోట్లతో, నిజాంసాగర్ చౌరస్తా నుంచి లింగాపూర్ వరకు రూ.11కోట్లతో రోడ్డు పనులు చేశారు. రూ.3.50కోట్లతో దేవునిపల్లి, కామారెడ్డి ప్రధాన శ్మశానవాటిక నిర్మాణం చేపట్టారు.
సమస్యల పరిష్కారానికి పెద్దపీట
మున్సిపల్ పరిధిలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి పాలకవర్గం పెద్దపీట వేస్తున్నది. కొత్త జిల్లాగా ఏర్పడిన కామారెడ్డికి మెదక్, సిరిసిల్ల్ల, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలకు సెంటర్గా ఉండడంతో ట్రాఫిక్ సమస్య పెరిగే అవకాశం ఉన్నది. దీంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. నర్సన్నపల్లి నుంచి టేక్రియాల్ బైపాస్ వరకు 3లైన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్, సిరిసిల్ల రోడ్ నుంచి దేవునిపల్లి వరకు 3లైన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిజాంసాగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. గుంతలమయంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేశారు. హరితహారంలో భాగంగా పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు డివైడర్ల మధ్య నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరగడంతో పచ్చదనం పరుచుకున్నది.
ముమ్మరంగా పనులు
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుండడంతో కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం అభివృద్ధి పనులను ముమ్మరంగా చేపడుతున్నది. సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా మంజూరు చేసిన రూ.50కోట్లు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ.25 కోట్ల తో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పట్టణ అవసరాలతు అనుగుణంగా పనులు చేపడుతున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పట్టణంలోని వార్డుల్లో స్వయంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ మున్సిపల్ పాలకవర్గసభ్యులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేయడంతో పట్టణాభివృద్ధికి బాటలు పడుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా గోడలకు వేసిన బతుకమ్మ, రాష్ట్ర చిహ్నాలు, ప్లాస్టిక్ నివారణ వంటి సందేశాత్మక చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తోపాటు ఇతర సమస్యలను గుర్తించి పూర్తిచేశారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థుల కోసం మున్సిపల్, ప్రభుత్వ నిధులతో మరుగుదొడ్లను నిర్మించారు. ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశారు.
కొనసాగుతున్న డివైడర్ నిర్మాణ పనులు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో..
సీఎం కేసీఆర్ కామారెడ్డి వచ్చిన సందర్భంగా కేటాయించిన నిధులు పట్టణాభివృద్ధికి దోహదపడ్డాయి. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సహకారంతో కామారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. ప్రత్యేక నిధులతో పట్టణ రూపురేఖలు మారిపోయాయి. సీసీరోడ్లు, డ్రైనెజీలు, కల్వర్టులు, పార్కు లు, వైకుంఠధామాలు నిర్మించాం. వార్డుల్లోని సమస్యలను స్వయంగా తెలుసుకొని అందుకు అనుగుణంగానే ప్రతిపాదనలు చేసి పనులు నిర్వహించాం. ప్రత్యేక నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటాం.
– గంపగోవర్ధన్, ప్రభుత్వ విప్
ప్రభుత్వ చేయూతతో..
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక నిధులు విడుదల చేయడంతో అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంపగోవర్ధన్ సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. 49వార్డుల్లో దశల వారీగా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నాం. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
– నిట్టు జాహ్నవి, మున్సిపల్ చైర్పర్సన్