నాగర్కర్నూల్, జూలై 22 : నాగర్కర్నూల్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి గుట్టురట్టు చేశారు. బుధవారం నాగర్కర్నూల్లో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 17న బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో తక్కువ ధరకు డీఏపీ విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు అగ్రికల్చర్ అధికారి కమల్కుమార్, ఎస్సై శంషుద్దీన్ గ్రామాన్ని సందర్శించి ఆరుగురు రైతులను విచారించగా ఎద్దుల నరేందర్రెడ్డి నుంచి డీఏపీ కొనుగోలు చేసినట్టు తెలిసింది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న 110 బస్తాల డీఏపీ నకిలీవిగా తేలడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
నకిలీ డీఏపీ సరఫరా చేసిన నరేందర్రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. తిమ్మాజిపేట మండలం అమ్మపల్లికి చెందిన దోమ శ్రీకాంత్రెడ్డి, బుద్ధసముద్రానికి చెందిన గంగారం నరేశ్, కోడుపర్తికి చెందిన సర్కపల్లి అశోక్, బిజినేపల్లి వెల్గొండకు చెందిన నాగోలు ఉదయ్కుమార్రెడ్డి, నాగోలు నవీన్రెడ్డి, నాగోలు సంతోష్రెడ్డి, అల్లీపూర్ గ్రామానికి చెందిన మలిశెట్టి ప్రకాశ్ ఏ-5గా ఉన్న అశోక్రెడ్డి ద్వారా రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలోని జగదీశ్కు చెందిన త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ ద్వారా నకిలీ డీఏపీని నాగర్కర్నూల్ జిల్లాకు సరఫరా చేసి విక్రయించినట్టు వివరించారు. నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, మిడ్జిల్ మండలాల్లో 4 వేల బస్తాల నకిలీ డీఏపీని విక్రయించినట్టు తేలింది. ఈముఠాలో ఏ-1గా ఉన్న జగదీశ్, ఏ-9గా ఉన్న నాగోలు సంతోష్రెడ్డి పరారీలో ఉన్నట్టు డీఎస్పీ వెల్లడించారు.