Masoud Pezeshkian : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అమెరికా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇరాన్కు చెందిన మీడియా సంస్త టెహ్రాన్ టైమ్స్, ఇస్లామిక్ రిపబ్లిక్కు చెందిన తన్సిమ్ న్యూస్ ఏజెన్సీ పలు వివరాల్ని వెల్లడించింది. త్వరలో ఐక్యరాజ్యసమితి సాధారణ సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ) జరగనుంది.
దీని కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. ఈ సదస్సుకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హాజరు కానున్నారు. త్వరలోనే ఆయన అమెరికా వెళ్తారని మీడియా సంస్తలు వెల్లడించాయి. అయితే, పెజెష్కియాన్ హాజరయ్యే తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. నిజానికి పెజెష్కియాన్ ప్రతి ఏడాది ఈ సమావేశం కోసం న్యూయార్క్ వెళ్తారు. ఇరాన్ తరఫున మాట్లాడుతారు. ఈసారి కూడా ఆయన సమావేశానికి హాజరు కావాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఇరాన్ ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి, అమెరికా చర్యల గురించి వివరించే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధం గురించి అంతర్జాతీయ సమాజానికి వివరించాలనుకుంటున్నారు.
ఇదే సమయంలో పలువురు ప్రపంచ నేతలను కూడా పెజెష్కియాన్ కలిసి చర్చలు జరుపుతారు. పెజెష్కియాన్ న్యూయార్క్ వెళ్లేటప్పుడు ఇరాన్కు చెందిన ఉన్నతాధికారులు, సైనికాధికారులు కూడా హాజరవుతారు. ఇప్పటికే పెజెష్కియాన్ సహా ఇరాన్ ప్రముఖులకు అమెరికా వీసాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య గత ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం జరుగుతోంది. దీంతో ఇరుదేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెజెష్కియాన్ అమెరికా పర్యటన ఆసక్తికరంగా మారింది.