Nizamabad | జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి సినిమాను తలపించే రేంజ్లో చేజింగ్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కారులో వచ్చి కాపర్ చోరీకి పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ముప్కాల్ నుంచి సదాశివనగర్ వరకూ వెంబడించారు. రోడ్డుపై బారికేడ్లు పెట్టి అడ్డగించాలని చూసినా దొంగలు ఆగకుండా దూసుకెళ్లారు. ఈక్రమంలో పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపినా దుండగులు తృటిలో తప్పించుకుని పరారయ్యారు.
నిజామాబాద్ క్రైం/ఇందల్వాయి/సదాశివనగర్, మే 29 : నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా సోమవారం తెల్లవారుజామున నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అలజడి సృష్టించింది. రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన ఈ దోపిడీ గ్యాంగ్ ఉమ్మడి జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్లోని కాపర్ కాయిల్స్(వైరు)ను దొంగలించడమే పనిగా పెట్టుకున్నది. ఈ ముఠా సభ్యులు గతంలో సైతం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా దొంగతనాలకు పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో ఈ ముఠా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని పోవడంతో పోలీసులకు సవాలుగా మారింది. దీంతో పోలీసులు ఈ ముఠాను ఎలాగైనా పట్టుకునేందుకు తమదైన శైలిలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పటిష్టం చేసుకున్నారు.
సీసీఎస్ టీమ్కు ఉన్న సమాచారం మేరకు సోమవారం తెల్లవారు జామున బాల్కొండ పరిధిలోని హైవే రోడ్డుపై కాపుకాసి ఉన్నారు. సుమారు రెండున్నర గంటల సమయంలో రాజస్థాన్ నుంచి కారులో నిజామాబాద్ జిల్లాకు వస్తున్న ఈ ముఠా సభ్యులు సీసీఎస్ టీమ్కు చిక్కకుండా అక్కడి నుంచి తప్పించుకొని కామారెడ్డి జిల్లా వైపు అతివేగంగా కారులో పారిపోయి వచ్చారు. గమనించిన సీసీఎస్ టీమ్ వెంటనే నిజామాబాద్ డివిజన్ పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేసింది. విషయం తెలుసుకున్న ఇందల్వాయి, ధర్పల్లి ఎస్సైలు తమ సిబ్బందితో ఇందల్వాయి టోల్ గేట్ వద్ద ముఠా కోసం కాపుకాచి ఉన్నారు. టోల్గేట్ వద్ద పోలీస్ పికెట్ ఉన్నట్లు గుర్తించిన ఈ గ్యాంగ్ ధర్పల్లి ఎస్సై పోలీస్ వ్యాన్ను తమ కారుతో ఢీ కొట్టి అతివేగంగా కామారెడ్డి వైపు దూసుకుపోయారు. దీంతో ధర్పల్లి ఎస్సై వంశీ కృష్డ్ణ రెడ్డి తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్తో దోపిడీ దొంగల కారు వైపు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.
అంతే కాకుండా వారిని పట్టుకొనేందుకు పోలీసు బృందాలు సైతం తమ వాహనాల్లో కారును వెంబడించాయి. పోలీసులు తమను వెంటాడుతున్నట్లు గుర్తించిన ముఠా సభ్యులు కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండల పరిధిలోని నేషన్ హైవే పక్కనే ఉన్న మల్లుపేట్ గ్రామం వైపు పోయారు. చివరకు గ్రామశివారులోని చెట్లలో కారును వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. నిజామాబాద్ పోలీస్ బృందాలు కారును గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. కారులో పారిపోయిన ముఠా సభ్యుల్లో ఒకరి ముఖం చిత్రం సీసీ కెమెరాకు చిక్కినట్లు తెలిసింది. పోలీసులు కారును స్వాధీనం చేసుకొని ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు తరలించారు. ధర్పల్లి ఎస్సై వంశీకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఆ ముఠాపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ముఠా ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
వేంపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీ
ముప్కాల్, మే 29 : పంట పొలాలకు చెందిన ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్లను దొంగిలిస్తున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో ఆరు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైరు చోరీకి పాల్పడ్డారని ఏఈ రవి తెలిపారు. నెల రోజుల్లోనే 17 ట్రాన్స్ఫార్మర్లను ఇదే విధంగా ధ్వంసం చేశారని తెలిపారు. ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కరా చారి తెలిపారు. ఈ దొంగల ముఠా హైవేలను ఆనుకొని ఉన్న పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేస్తున్నదన్నారు. ముఠా కోసం నిజమాబాద్ సీపీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందం వెంబడించగా దొంగలు కారును వదిలి పారిపోయినట్లు ఎస్సై తెలిపారు.