ఖలీల్వాడి సెప్టెంబర్ 11 : నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖాన అత్యాధునిక వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. దవాఖానలో కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. అందుకు తగినట్లుగా కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక పరికరాలను సమకూరుస్తున్నది. దీంతో ఖరీదైన శస్త్ర చికిత్సలు సైతం ఉచితంగా అందిస్తూ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖాన ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నది.
పల్లె, బస్తీ, మాడ్రన్ దవాఖాలను ఏర్పాటు చేసి సర్కారు వైద్యాన్ని మరింత చేరువ చేశారు. అత్యంత ఖరీదైన మల్టీ స్పెషాలిటీ సేవలను కూడా ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా అందిస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో రోజురోజుకూ ఓపీ సేవలు గణనీయంగా పెరుగుతున్నాయి. జీజీహెచ్కు రోగులు క్యూ కడుతున్న నేపథ్యంలో సేవలను కూడా మరింత విస్తృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా కోట్ల రూపాయలతో సీటీ స్కాన్, టిఫా స్కాన్, డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ హబ్ తదితర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్ సేవలను కూడా ప్రారంభించనున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానలో సంవత్సర కాలంలో 51, 261 అరుదైన శస్త్ర చికిత్సలు చేసి రికార్డు సృష్టించింది. సీఎం కేసీఆర్ ప్రోత్సాహం రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో జిల్లాకు డయాలసిస్ సెంటర్, గుండెకు సంబంధించిన క్యాథ్ల్యాబ్ రూ. 8కోట్లతో త్వరలోనే అందుబాటులోకి రానున్నది. మోకాళ్ల చిప్పల మార్పిడితో రాష్ట్రంలోనే నిజామాబాద్ పేరు మారుమోగింది. డాక్టర్ నాగేశ్వర్రావు అత్యధిక ఆపరేషన్లు చేసి జిల్లాకు మంచిపేరు సంపాదించి పెట్టారు. దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ నిత్య పర్యవేక్షణలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు.
జిల్లా ప్రభుత్వ దవాఖానలో కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. ప్రైవేటు దవాఖానల్లో లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్లు సైతం ఉచితంగా నిర్వహిస్తున్నారు. మోకాళ్ల చిప్పల మార్పిడికి సుమారు రూ. 5 నుంచి 8 లక్షలు ఖర్చును ప్రభుత్వమే భరిస్తున్నది. ఏడాదిలో ఆర్థో విభాగంలో 6,919 శస్త్ర చికిత్సలు, జనరల్ సర్జన్లో 13,348, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి 2,116, ఊపిరితిత్తుల విభాగంలో 3394, మేజర్ సర్జరీ విభాగంలో 16,773 శస్త్ర చికిత్సలు అందించారు. సంవత్సరానికి 90 వేల మంది కిడ్నీ రోగులు ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. 8711 డెలివరీలు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. సంవత్సర కాలంలో 51, 261 శస్త్ర చికిత్సలు చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నది.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖ ర్చుపెట్టి అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. అత్యధిక శస్త్ర చికిత్సలు చేసిన నిజామాబాద్ దవాఖానకు అరుదైన గౌరవం దక్కింది.
-ప్రతిమారాజ్, జీజీహెచ్ సూపరింటెండెంట్
ప్రభుత్వ దవాఖానల్లో లక్షలు ఖర్చయ్యే వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోనే అరుదైన ఆపరేషన్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అవార్డులు అందుకున్న ఏకైక ప్రభుత్వ దవాఖాన మనదే..
– డాక్టర్ జలగం తిరుపతి రావు, మెడికల్ కళాశాల ప్రొఫెసర్
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులు కల్పిస్తున్నది. ఖరీదైన వైద్యం ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా అందుతున్నది. సీటీ స్కాన్ అందుబాటులో ఉంది. త్వరలోనే క్యాథ్ల్యాబ్ సేవలు, ఎమ్మారై సేవలు అందుబాటులోకి వస్తాయి.
-నిమ్మల బాల్రాజ్, డిప్యూటీ సూపరింటెండెంట్