కామారెడ్డి, జూన్ 27 : జిల్లాలో పోలియో చుక్కలు వేయడానికి సర్వం సిద్ధం చేశారు. పోలియో మహమ్మారి నివారణలో భాగంగా ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 30వరకు పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించనున్నది. ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 2,14, 165 ఇండ్లు ఉండగా, 1,03,678 మంది చిన్నారులకు పోలియో చుక్కలను వేయనున్నారు.
చుక్కల కార్యక్రమం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని ఆవాస ప్రాంతాలు, 20 ప్రాథమిక కేంద్రాలు, రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 23 ప్రయాణ కూడళ్లు, 22 మొబైల్ టీంల ద్వారా బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన కూడళ్లలో పోలియో బూత్లను ఏర్పాటు చేయనున్నారు.కార్యక్రమ నిర్వహణకు వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, విద్యాశాఖ నుంచి 2,552 మందిని నియమించారు. పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహించడానికి వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించనున్నారు.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో పోలియో వ్యాధి వ్యాపిస్తుంది. దీంతో పుట్టిన చిన్నారుల నుంచి మొదలుకొని ఐదేండ్లలోపు చిన్నారులందరికీ ప్రతిఏటా పోలియో చుక్కలను వేస్తారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే చిన్నారులకు పోలి యో వచ్చే అవకాశం ఉన్నది. అందుకే చిన్నారులకు చిన్నప్పటి నుంచి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని, పరిశుభ్రంగా ఉండాలని, పిల్లలను ఎత్తుకునే వారు కాళ్లు, చేతులు కడుక్కోవాలని వైద్యులు, మన పెద్దలు సూచిస్తూ ఉంటారు.
వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాం. జిల్లా వ్యాప్తంగా నేడు 733 కేంద్రాల ద్వారా 1,03,678 మంది చిన్నారులకు పోలియో చుక్కలను వేయనున్నాం. మొదటి రోజు పోలియో చుక్కలు వేసుకోని వారికి తర్వాత రోజు అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేస్తారు.
-డాక్టర్ వెంటక్, డీఎంహెచ్వో, కామారెడ్డి