కామారెడ్డి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడులకు పూర్వవైభవం వచ్చింది. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యారంగాన్ని సమూలంగా మార్చిన కేసీఆర్ సర్కారు.. మన ఊరు-మన బడి కార్యక్రమంతో స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పించింది. ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి రావడంతో తల్లిదండ్రులు సర్కారు బడికే సై అంటున్నారు. ఇంగ్లిష్ మీడియం, ఉచితంగా బుక్స్, యూనిఫామ్స్, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తుండడంతో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో 24వేల మందికి పైగా కొత్తగా ప్రవేశాలు తీసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించడం, ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించి నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో రోజురోజుకూ అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. ఓ వైపు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన భవనాలను నిర్మించి, సకల సౌకర్యాలను కల్పిస్తుండడంతో ప్రైవేటు పాఠశాలల నుంచి సైతం విద్యార్థులు సర్కారు బడుల్లో చేరుతున్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేయడంతో పాటు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం పెడుతుండడంతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ద్వారా బడీడు పిల్లలను బడుల్లో చేర్పించారు.
కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది మొత్తం 1,58,582 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. 2022-23 విద్యాసంవత్సరంలో టెన్త్లో 295 పాఠశాలల నుంచి 11,899 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గతంలో 49 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తే, 2022-23లో 112 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో కామారెడ్డి జిల్లా 7వ స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు
సర్కారు బడుల్లో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు మెరుగైన విద్యను అందిస్తుండడంతో తల్లిదండ్రులు పిల్లలను చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు. మౌలిక వసతుల కల్పనకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మన ఊరు-మనబడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. కామారెడ్డి జిల్లాలో మొదటి దశలో 351 పాఠశాలల్లో సుమారు రూ.165 కోట్ల ఖర్చుతో మౌలిక వసతులను కల్పించారు. రూ.30లక్షల అంచనా వ్యయం కన్నా తక్కువ గల 235 పాఠశాలలు, రూ.30లక్షల కన్నా అధికంగా అంచనా గల 116 పాఠశాలలను గుర్తించి పనులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 220 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రతీ మండలంలో 2 చొప్పున 46 పాఠశాలను మోడల్ పాఠశాలలుగా గుర్తించి పనులు చేపట్టారు. అలాగే 137 అదనపు తరగతి గదులు, ఎంఆర్సీ భవనాలు, టాయిలెట్లు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ టీవీలు ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ.125 కోట్లను ఖర్చు చేశారు. 2023-24 సంవత్సరానికి గాను డైరెక్టర్ నేషనలైజ్డ్ టెక్ట్స్ బుక్స్ను చైల్డ్ ఇన్ఫో ఆధారంగా పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాన్ని పెడుతున్నారు. ఇందుకోసం జిల్లాకు రూ.వంద కోట్లు కేటాయించారు.
ప్రభుత్వ బడుల్లోనే ఉత్తమ విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో సువిశాలమైన తరగతి గదులు ఉన్నాయి. ఉత్తమ విద్యను బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి మేం ఆసక్తి చూపుతున్నాం. ఇక్కడే ఉత్తమ విద్య అందుతున్నది.
–దర్శన్, విద్యార్థి తండ్రి, దేవునిపల్లి
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు అధికంగా తీసుకొని, విద్యార్థులపై శ్రద్ధ పెట్టడం లేదు. క్వాలిఫైడ్ టీచర్లు ఉండరు. తల్లిదండ్రులు మోసపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమమైన విద్యను అందిస్తున్నారు. దీనికి తోడు మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, నోట్ బుక్కులు అందిస్తున్నారు. అందుకే మేం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాం.
–దశరథం, విద్యార్థి తండ్రి, దేవునిపల్లి
ప్రైవేట్ స్కూల్ కన్నా బాగుంది..
యూనిఫాం వేసుకొని, డిజిటల్ బోర్డుల మీద టీచర్లు చెప్పే పాఠాలు వింటుంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఫీలింగ్ వస్తున్నది. ఈ సారి పదోతరగతి కాబట్టి టైంపాస్ చేయొద్దని టీచర్లు చెబుతున్నారు. ఎక్స్ట్రా క్లాసులు చెబుతారట. వేలకు వేలు పెట్టి చదువుకునే ప్రైవేట్ సూళ్ల కన్నా ప్రభుత్వ పాఠశాలలే బాగున్నాయ్.
–జయశీల, 10వ తరగతి, జడ్పీహెచ్ఎస్ (బాలికల) , ఎల్లారెడ్డి
ప్రభుత్వ స్కూల్ జేయవట్టి నా పిల్లలు సదువుకుంటున్నరు…
రెండేండ్ల కింద మాయింటాయన పోయిన కాడి నుంచి పైసలకు మస్తు తక్లీఫ్ అయితుంది. ఇగ నా పిల్లలకు సదువు జెప్పించుడు నాతో అయితలేదు. ఎల్లారెడ్డికి అచ్చి ఇద్దరు పిల్లలను గవర్నమెంట్ స్కూల్ల, ఉండేతందుకు హాస్టల్ల చేర్పించిన. స్కూల్ల సార్లు సదువు మంచిగ చెబుతున్నరు. మధ్యాహ్నం బడిలనే తింటున్నరు. హాస్టల్లో ఉంటున్నరు. మా అసంటోళ్లకు కేసీఆర్సార్ దేవుని లెక్క అయిండు. కేసీఆర్ సార్కు సచ్చేదాక రుణపడి ఉంట.
–ఆలకుంట గంగామణి,గృహిణి,కొట్టాల
సర్కారు బడులల్లనే సదువు మంచిగున్నది..
ప్రైవేట్కన్నా సర్కారు బడులల్లనే సదువు మంచిగ చెబుతున్నరు. నా కొడుకు పేరు సాయిరిషి, 10వ తరగతి సదువుతున్నడు. చిన్నప్పడి సంది ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో వేలకు వేల రూపాయలు ఫీజు కట్టి సదివిపించిన. 8వ తరగతి కాంగనే ఆ స్కూల్లో సదువు నాకు మంచిగనిపియ్యలేదు. వెంటనే బోధన్లోని ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతిలో చేర్పించిన. పోయిన యాడాది గూడా నా కొడుకు సదువు సక్కగ నడవలేదనిపించింది. వెంటనే ఎల్లారెడ్డికి తెచ్చి మోడల్స్కూల్లో 10వ తరగతిలో జెయిన్ చేసిన. మోడల్స్కూల్లో సార్లు మంచిగున్నరు. సదువు మంచిగ జెప్తున్నరు. రూపా యి ఫీజు లేదు. పుస్తకాలు, యూనిఫాంలు అన్ని ఫ్రీగానే వచ్చినయ్. రూపాయి ఖర్చు లేకుండా మంచి సదువు ప్రభుత్వ స్కూళ్ళల్ల దొరుకుతున్నది.
–అతినారపు కృష్ణమూర్తి, ప్రైవేట్ ఉద్యోగి, ఎల్లారెడ్డి
కొత్త అడ్మిషన్లు ఇలా..
కామారెడ్డి జిల్లాలో బడిబాట ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం అడ్మిషన్లు 9,814 జరిగాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 14,529 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఉమ్మడి జిల్లాలో అడ్మిషన్ల సంఖ్య మొత్తం 24,343కి చేరింది. బుధవారం ఒక్క రోజే కామారెడ్డి జిల్లాలో 193 అడ్మిషన్లు, నిజామాబాద్ జిల్లాలో 234 అడ్మిషన్లు జరగడం గమనార్హం. సగటున ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ 200 విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో బుధవారం నాడు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి 140 మంది విద్యార్థులు, నిజామాబాద్ జిల్లాలో 156 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. 2వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఒకటో తరగతిలో నిజామాబాద్ జిల్లాలో 156 మంది, కామారెడ్డి జిల్లాలో 53 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
ఎఫ్ఎల్ఎన్తో మెరుగైన విద్య
తొలిమెట్టు కార్యక్రమం జిల్లాలోని అన్ని ప్రాథమిక, ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించారు. గుణాత్మక విద్య, ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు 22 మంది మండల స్థాయి మానిటరింగ్ అధికారులు, 61 మంది కాంప్లెక్స్ నోడల్ అధికారులను నియమించారు. జిల్లా స్థాయిలో ఎఫ్ఎల్ఎన్ అమలు ద్వారా విద్యార్థులు చదువులో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నారు. అలాగే ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
ఉత్తమ విద్యను అందించడమే ధ్యేయం..
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి పాఠశాలలను బలోపేతం చేస్తున్నది. వందల కోట్లతో పాఠశాల భవనాలను నిర్మిస్తున్నది. అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నది. దీంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. బడి బాట ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 10వేల మంది విద్యార్థులు చేరారు. అడ్మిషన్లకు ఇంకా సమయం ఉంది. దీని సంఖ్య మరింత పెరగనున్నది.
–రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి
64 మంది విద్యార్థులు చేరారు..
జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది. క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. అందుకే మా పాఠశాలలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు 64 అడ్మిషన్లు కాగా, అందులో 28 ప్రైవేటు పాఠశాలలు, 36 ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు.
– కె.గంగాకిషన్, హెడ్మాస్టర్, జడ్పీహెచ్ఎస్, దేవునిపల్లి