సదాశివనగర్, జనవరి 24: వచ్చే లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ స్థానం నుంచి పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి సత్తా చాటాలని ఎంపీ బీబీపాటిల్ పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. సదాశివనగర్ – రామారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీబీపాటిల్ హాజరై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిందని, అయినప్పటికీ నెలన్నరలోనే నమ్మకం కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ను తిరస్కరించే రోజులు వచ్చాయన్నారు. మాటలతో కాకుండా చేతల నాయకులను ప్రజలు మర్చిపోరని అన్నారు.
కష్టకాలంలో పార్టీ కార్యకర్తలు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండడంతోపాటు పారిశ్రామికవేత్తల నుంచి నిధులు తెచ్చి స్థానిక సమస్యలను పరిష్కరించానని గుర్తుచేశారు. కేసీఆర్ మార్గాన్ని అనుసరిస్తూ సేవచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. జహీరాబాద్ పరిధిలో రూ. 5వేల కోట్లతో నేషనల్ హైవే, ప్రధానమంత్రి సడక్ యోజన కింద రూ. 78 కోట్లతో రోడ్లు నిర్మించడంతోపాటు రూ. 12వందల కోట్లతో బోధన్-బీదర్ రైల్వే లైన్ మంజూరు చేయించానని వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్రెడ్డి, రవీందర్గౌడ్, జడ్పీటీసీ నరసింహులు, ఎంపీపీ అనసూయ, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్రావు, ఏఎంసీ చైర్మన్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.