ఎల్ఐసీలో ప్రభుత్వ మూలధనం కేవలం రూ.100కోట్లే. కానీ తన లాభాల్లో ఏటా ఐదుశాతాన్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో అందిస్తున్నది. ఏటా రూ.28వేల కోట్ల డివిడెండ్ కేంద్రప్రభుత్వానికి అందిస్తున్న అక్షయపాత్ర భారత జీవితబీమా సంస్థ. అలాంటి కామధేనువును కబేలాకు తరలిస్తున్నది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. 5-10శాతం వాటాను ఉపసంహరించుకుని లక్ష కోట్లు సమీకరించుకునేందుకు బంగారుబాతులాంటి ఎల్ఐసీని బలవంతంగా అమ్మకానికి పెడుతున్నది. మోదీ ప్రభుత్వ తీరుపై అన్నివర్గాల ప్రజలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ఎల్ఐసీ పాలసీదారులు, ఉద్యోగుల భవితవ్యాన్ని బీజేపీ ప్రభుత్వం అగమ్యగోచరంగా మారుస్తున్నది. దేశభక్తికి తానేదో బ్రాండ్ అంబాసిడర్గా గప్పాలు కొట్టుకునే బీజేపీ.. దేశసంపదను అప్పనంగా అమ్మేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కామారెడ్డి, ఫిబ్రవరి 22: దేశ ప్రజల జీవితంలో భాగస్వామ్యం అయిన భారత జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)పై మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగిస్తుంది. ఎల్ఐసీ నిర్వీర్యానికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేయడమే కాక ఐపీవో దిశగా సాగుతున్నది. నమ్మకమైన సేవలకు మారుపేరుగా ఎల్ఐసీ నిలుస్తుండగా, లాభాల్లో ఉన్న సంస్థ నిర్వీర్యానికి తెరలేపడంతో కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలకు పెద్దదిక్కులా ఉన్న ఎల్ఐసీ వాటాల విక్రయానికి తెరలేపింది. దీంతో ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు నిరసన వ్యక్తంచేస్తూ ఆందోళన బాట పడుతున్నారు. నరేంద్రమోదీ సర్కార్పై ప్రజలతోపాటు ఎల్ఐసీ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మొదలైంది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎల్ఐసీ సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న ఎల్ఐసీ వివిధ రకాల సేవలను అందిస్తుంది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్ఐసీ మొదటి స్థానంలో నిలిచి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నది. గత 4,5 దశాబ్దాలుగా అనేక రకాల పాలసీలతో ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలుస్తున్న సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం అడుగులు వేయడంతో తీవ్రప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్థాయి నుంచి పాలసీలను అందిస్తున్న ఏజెంట్లపై ప్రభావం పడనున్నది. ఎల్ఐసీకి కీలకంగా ఉన్న ఏజెంట్ల జీవనోపాధిని దెబ్బతీయనున్నది. కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామాలకు 800లకు పైగా ఏజెంట్లు ఉన్నారు. కామారెడ్డి బ్రాంచ్ పరిధిలో 30మంది ఉద్యోగులు, సిబ్బందితోపాటు 15 మంది డెవలప్మెంట్ ఆఫీసర్లు పని చేస్తున్నారు. లక్షలాది పాలసీదారులు ఉండగా, పాలసీ లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
భారత జీవిత భీమా సంస్థను కేంద్రం ఐపీవోకు తేవడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఆరంభం నుంచి నేటి వరకు లాభాల్లో ఉండి ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ పాలసీదారులకు నమ్మకమైన సేవలను అందిస్తున్న ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూకు తీసుకురావడంపై విమర్శలు వస్తున్నాయి. ఎల్ఐసీ బీమా వాటాల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ భారతీ బీమా సంస్థ ఉద్యోగుల సమాఖ్య, ఆలిండియా బీమా ఉద్యోగుల సమాఖ్య, లియాఫీ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎల్ఐసీ ఐపీవోపై కార్మిక సంఘాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుమార్లు సమ్మెలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీమా ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లు, సాధారణ ప్రజలు సైతం కదం తొక్కారు. టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన టీఆర్ఎస్కేవీతోపాటు సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలు అనేకసార్లు ఉద్యమించాయి. కేంద్రం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని ఎల్ఐసీ ఉద్యోగ, ఏజెంట్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయడం, కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే కుట్రలకు మోదీ సర్కారు తెరలేపడం సరికాదు. బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసీ గొంతునులిమే కుట్ర చేయడం దుర్మార్గం. వందలాది మందిని ఏజెంట్లుగా మార్చడంతోపాటు వేలాది మందిని పాలసీదారులుగా చేర్పించి మా వంతు సహకారం అందిస్తున్న సంస్థను విక్రయించడం తగదు. కేంద్రం తీరుపై ఉద్యోగులు, ఏజెంట్లు, పాలసీదారులంతా కలిసి పోరాటం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఐక్యపోరాటాలకు సిద్ధమవుతాం. ఎల్ఐసీ విషయంలో కేంద్రం పునరాలోచించాలి.
ఎల్ఐసీ ఓ నమ్మకమైన సంస్థగా ఉన్నది. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎల్ఐసీపై మరింత ప్రభావం చూపుతుంది. దేశంలోనే నెంబర్వన్గా నిలుస్తున్న సంస్థ వాటాలను విక్రయించడం, ప్రైవేటీకరణ వంటి నిర్ణయాలు సరికాదు. లాభాపేక్ష లేకుండా పాలసీదారుల సంక్షేమం కోసం ముందుండే ఎల్ఐసీకి ఐపీవో పెట్టడం సరికాదు. ప్రైవేట్ సంస్థల్లా ఎల్ఐసీని తయారు చేయాలని కుట్రలు చేస్తున్నారు.
మంచి లాభాల్లో ఉన్న సంస్థపై ప్రైవేటీకరణ నిర్ణయం సరైంది కాదు. ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లతోపాటు పాలసీదారులు కూడా ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటీకరణ, ఐపీవో చేపట్టడంతో పాలసీదారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఐపీవో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది.
– రాంశెట్టి శేఖర్, ఎల్ఐసీ ఏజెంట్, అడ్లూర్ ఎల్లారెడ్డి