కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కార్యనిర్వాహక వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగింది. మూడు నెలల్లోనే హస్తం పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని శాఖల్లోనూ చోటు చేసుకున్న బదిలీలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుల ఆశీస్సులతో కొందరు అనుకున్న చోటికి బదిలీ చేసుకోగా, మరికొంత మంది మాత్రం ఉన్న చోటే కొనసాగేలా చక్రం తిప్పారు. ఇలా కాంగ్రెస్ నేతల ఆశీస్సులతో, ముడుపుల వ్యవహారాలతో బదిలీల వరుస జరిగినట్లుగా అంతటా చర్చ జరుగుతున్నది.
-నిజామాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
అధికారుల బదిలీల్లో హస్తం ముద్రవేసుకుంటున్నది. అన్ని శాఖల్లోనూ తమకు నచ్చినవారే ఉండాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు అధికారుల బదిలీలు చేయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇష్టారాజ్యంగా బదిలీలు చేపట్టడం ద్వారా ఆయా శాఖల్లో పని చేసిన ఉద్యోగులంతా అయోమయానికి గురయ్యారు. బదిలీ ఉత్తర్వులు విడుదలైన గంటల వ్యవధిలోనే నిలుపుదల చేయడం, ఆ వెంటనే మరో జీవో విడుదల కావడం విస్మయానికి గురిచేస్తున్నది. ఈ రకమైన జీవోల పరంపరలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి.
నాలుగైదు రోజుల కింద బిచ్కుంద మండలానికి ఎంపీడీవోగా పర్బన్న వచ్చారు. ఆయన బాధ్యతల స్వీకరణకు ముందే నాగిరెడ్డిపేట మండలానికి బదిలీ చేశారు. కేవలం ఓ అధికార పార్టీకి చెందిన నాయకుల ఫిర్యాదులు, నియోజకవర్గంలోని ఓ కీలక నేత ఆదేశాలతో బదిలీ నిమిషాల్లో మారిందనే టాక్ వినిపిస్తున్నది. జుక్కల్ నియోజకవర్గంలోని మహ్మద్నగర్ మండల తహసీల్దార్గా క్రాంతి కుమార్ విధులు నిర్వర్తిస్తుండగా ఇతన్ని కలెక్టరేట్కు బదిలీ చేశారు. మళ్లీ ఏమైందో కానీ యథావిధిగా కొనసాగుతున్నాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఓ సీఐ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నది. ఓ ఎమ్మెల్యే సిఫార్సుతో కమిషనరేట్కు వచ్చిన సీఐ తీరును ఓ ఉన్నతాధికారి తీవ్రంగా ఆక్షేపించినట్లు సమాచారం.
దీంతో నొచ్చుకున్న సదరు పోలీసు ఇక్కడ విధులు చేపట్టేందుకు భయపడి వెనక్కి వెళ్లేందుకు సిద్ధపడినట్లు సమాచారం. తీరా సిఫార్సు చేసిన నాయకుడే రంగ ప్రవేశం చేసి హైదరాబాద్ స్థాయిలో పోలీస్ ఉన్నతాధికారులతో మాట చెప్పించుకుని తన పంతాన్ని నెగ్గించుకున్నట్లుగా తెలుస్తున్నది. సిఫార్సులతో వచ్చిన సదరు సీఐ ప్రస్తుతం అనుకున్న చోటనే విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఎప్పుడు ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఓ ఏసీపీ బదిలీ వ్యవహారంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎక్కడో పనిచేసే ఏసీపీని కాంగ్రెస్ నేతలు కావాలని ఇక్కడికి బదిలీపై తీసుకొచ్చినట్లు తెలిసింది.
ఇక నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా అంకిత్ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అనాలోచితంగా ఉన్నాయి. మేడారం మహాజాతర కొనసాగుతున్న కీలక సమయంలో ఐటీడీవో పీవోగా ఏటూర్ నాగారంలో పనిచేస్తున్న ఐఏఎస్ను అక్కడ్నుంచి కదిలించడం సరికాదంటూ చర్చ నడుస్తున్నది. పాలకవర్గాల పదవీకాలం పూర్తయి నిస్తేజంగా ఉన్న జీపీలకు కీలక బాధ్యుడిగా ఉండాల్సిన అదనపు కలెక్టర్ ఇక్కడ రిపోర్టు ఇచ్చిన తర్వాత తిరిగి మేడారం డ్యూటీలో నిమగ్నమైనట్లు తెలుస్తున్నది. సమ్మక్క-సారక్క జాతర తర్వాతే బదిలీ చేస్తే సరిపోయేది కదా? అన్న వాదన వినిపిస్తున్నది. అనుకున్నదే తడవుగా రాజకీయ ఒత్తిళ్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని ప్రజలు భావిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేసే నలుగురైదుగురు అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదమవుతున్నది. రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ త మ పనిని కానిస్తున్నారు. రెవెన్యూలో దంపతులుగా వెలుగొందుతున్న ఓ అధికారి కలెక్టరేట్కు వచ్చి వివాదాస్పద భూముల వ్యవహారాల్లో అనేకమార్లు జో క్యం చేసుకొని గతంలో ఉన్నతాధికారులతో చివాట్లు తిన్నారు. కలెక్టరేట్కు వచ్చి ఏండ్లు గడుస్తున్నా కదలకుండా, వదలకుండా ఇతరులకు అవకాశం ఇవ్వకుండా చక్రం తిప్పుతున్నారు. ఈ వ్యక్తి వెనకాల భూముల వ్యవహారాలను చక్కబెట్టే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత ఉన్నట్లుగా తెలుస్తున్నది.
ఇతగాడిని మారిస్తే కబ్జాలకు ఇబ్బందులు తలెత్తుతాయని, సెటిల్మెంట్లకు అవకాశం ఉండదని అండగా నిలుస్తున్నట్లు ప్ర చారం జరుగుతోంది. రెవెన్యూ సంఘం పేరిట మరొకరు ఇదే తీరులో మునిగి తేలుతున్నాడు. మొన్నటి వరకు తన సామాజిక వర్గానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఆశీస్సులతో ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహారాలు నడిపించాడు. ప్రభుత్వం మారడంతోనే కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరుగుతూ బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేశాడు.
తీరా బదిలీ వ్యవహారాలు రాగానే తన సీటుకు ఎసరు రాకుండా జాగ్రత్త పడుతుండడం గమనార్హం. బైపాస్ రోడ్డులో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నడిపిస్తున్న ఇతగాడు ఉన్నతాధికారులకే వాటాలు అప్పగించి తాను అనుకున్న పనులను చక్కబెట్టేసుకుంటున్నట్లు ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు. దళారీ మాదిరిగా వ్యవహరించే ఒకరిద్దరు రెవెన్యూ అధికారుల తీరును చూసి మరికొంత మంది కూడా ఇలాగే వక్రమార్గంలో నడుస్తుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ వ్యవస్థను రూపు మాపాలని ప్రజలు కోరుతున్నారు.